హైదరాబాద్: ఏ దేశానికైనా పౌరసత్వం ఉండాలని, దానికో చట్టం ఉండాలని, దేశంలోకి చొరబాటుదారులను అనుమతించమని ఎవరూ చెప్పరని సిఎం కెసిఆర్ తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్సిఆర్, ఎన్పిఆర్ కు వ్యతిరేకంగా సిఎం కెసిఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేఖ చర్య అని టిఆర్ఎస్, మజ్లిస్ మిత్రపక్షాలని అనేక సందర్భాల్లో చెప్పామన్నారు. మెక్సికో నుంచి అమెరికాలోకి రాకుండా ట్రంప్ గోడ కడతామన్నారని, దేశ సరిహద్దుల మీదుగా గోడకడతామంటే తాము సపోర్ట్ చేస్తామని, మనం కంటి నిండా నిద్రపోతున్నామంటే సైన్యం త్యాగమేనని, సిఎఎని ఎవరైనా వ్యతిరేకిస్తే వారు దేశ ద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లు అయితరా? అని కెసిఆర్ అడిగారు.
లౌకిక పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ టిఆర్ఎస్ అని, తమ పాలసీ తమదని, సమాజం హర్షిస్తుందా లేదా అన్నది చూద్దామన్నారు. విభజన సమయంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చి దేశంలో స్థిరపడ్డారని, దేశం మొత్తాన్ని విశ్వాసంలోకి తీసుకొని చేయాలని కేంద్రాన్ని కోరారు. ఎన్పిఆర్ చేస్తాం, ఎన్ఆర్సి చేయబోమంటే కేంద్రాన్ని ఎవరూ నమ్మడం లేదని దుయ్యబట్టారు. రొట్టేలు చేయమని చెప్తునప్పుడు పిండి ఎందుకు దంచుతున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్లో పెట్టిన నివేదికలో రాసిందొకటి, చేసేది మరొకటి అని, ఎలాంటి సర్టిఫికెట్లు లేని కూలీనాలి చేసుకునే అమాయకులకు పౌరసత్వం అకస్మాత్తుగా రద్దయితే పరిస్థితేంటని కెసిఆర్ అడిగారు. కాలక్రమంలో ఆవాసాలు, నివాసాలు మారుతుంటాయని, 2003లో వాజ్పేయి ప్రభుత్వం చేసిన ప్రయత్నం విఫలమైందని, ఏమి ఆశించి మళ్లీ అదే బేస్ మీద ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని కెసిఆర్ నిలదీశారు. చేయాలనుకుంటే బాజాప్తా చేయండి, ముసుగు వైఖరి ఎందుకు అని అడిగారు.