కోల్కతా: గో మూత్రం తాగితే, ఆవు పేడ శరీరానికి రాసుకుంటే కరోనా వైరస్ సోకదని దుస్ప్రచారం చేయడంతో కొందరు ప్రజలు మూఢనమ్మకాలతో గో మూత్రం, ఆవు పేడను కొనుగోలు చేస్తున్నారు. ఓ పాల వ్యాపారి కోల్కతాకు 20 కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారిపై లీటర్ గోమూత్రాన్ని రూ.500 అమ్ముతున్నాడు. ఆవు పేడను రూ.500 కిలో లెక్కన అమ్ముతున్నాడు. ఢిల్లీలో జరిగిన హిందూ మహాసభలో గో మూత్రం సేవిస్తే కరోనా వైరస్ దరిచేరదని చెప్పడంతో గో మూత్రాన్ని, పేడను అమ్ముతున్నానని మబూద్ అలీ తెలిపాడు. తనకు రెండు ఆవులు ఉన్నాయని, ఒకటి దేశీయ ఆవు, మరొకటి జెర్సీ ఆవు ఉందని, తాను సాధారణంగా రోజు పాలు అమ్మి జీవనం సాగిస్తానని, హిందూ మహాసభ ద్వారా గో మూత్రం, పేడ ఉపయోగాలు తెలుసుకొని, వాటిని అమ్ముతున్నానని అలీ తెలిపాడు. జెర్సీ ఆవు మూత్రం లీటర్, కిలో పేడ 300 రూపాయలు పెట్టి కొంటున్నారని తెలిపాడు. దేశీయ ఆవు మూత్రానికి మాత్రం బాగా గిరాకీ ఉందని తెలిపాడు. ఆవు మూత్రం, పేడతో కరోనా వైరస్ ను నివారించలేమని వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులు ఆవు పేడ, మూత్రాన్ని ఎవరు సేవించొద్దని వైద్యులు పేర్కొన్నారు. కరోనా వైరస్తో భారత్లో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోగా 126 మందికి వ్యాధి సోకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచంలో కరోనా సోకి 7175 మంది మృతి చెందగా 183143 మంది వ్యాధి సోకిందని డబ్ల్యుహెచ్ఒ వెల్లడించింది.