జైపూర్: సెల్ఫోన్ దొంగతనం చేశాడని దళిత వృద్ధుడిని(75) అగ్ర కులస్థులు కొట్టడంతో అతడు చికిత్స పొందుతూ చనిపోయిన సంఘటన రాజస్థాన్లోని సికర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మార్చ్ 4వ తేదీన జితేంద్ర యాదవ్, భరత్భూషణ్, దిలిప్ సింగ్, సందీప్ మీనా, సందీప్ యాదవ్ అనే అగ్ర కులానికి చెందిన వ్యక్తులు సహ పంక్తి భోజనం చేస్తుండగా మదన్ లాల్ మీనా అనే దళిత వృద్ధుడు (75) వారి వద్ద నుంచి సెల్ఫోన్లు దొంగలిచ్చాడని అనుమానించి అతడిపై ఐదుగురు దాడి చేశారు. ఆ వృద్ధుడి దాడి చేసిన వీడియోలు మార్చి 5న వైరల్గా మారాయి. తీవ్రంగా గాయపడిన వృద్ధుడు సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. వృద్ధుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఆ ఐదుగురిని అరెస్టు చేశామని ఎఎస్పి దినేశ్ అగ్రవాల్ తెలిపాడు.