ముంబై: కరోనా నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) బీజీగా ఉంది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి క్రికెట్ సిరీస్లు అక్కడే నిలిచి పోయాయి. ఐపిఎల్తో సహా దాదాపు అన్ని ప్రధాన టోర్నీలు, సిరీస్లు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కాగా, భారత్లో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా జరిగే ఐపిఎల్ను ఈసారి ఎలాగైన జరపాలనే ఉద్దేశంతో ఉన్న బిసిసిఐ దానికి అనుగుణంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పలు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది కరోనా దెబ్బకు క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఐపిఎల్తో సహా చాలా టోర్నీలు జరుగుతాయా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ను నిర్వహించేందుకు భారత ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో బిసిసిఐ ఉంది. ఇందుకుగాను విదేశీ క్రికెటర్లు ఐపిఎల్లో పాల్గొనేలా ఆయా దేశాల క్రికెట్ బోర్డులను మచ్చిక చేసుకోవాలని బిసిసిఐ భావిస్తోంది. దీని కోసం ఆగస్టు నెలలో భారత జట్టును దక్షిణాఫ్రికా టూర్కు పంపించేందుకు అంగీకరించింది. అంతేగాక వెస్టిండీస్తో కూడా సిరీస్ ఆడేందుకు సుముఖుత వ్యక్తం చేసింది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివర్లో ఐపిఎల్ జరిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాగా, ఐపిఎల్ నిర్వహణ కోసం భారత్ ఏకంగా ట్వంటీ20 ప్రపంచకప్ను సయితం వాయిదా వేయాలని భావిస్తోంది. ఇందుకోసం తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.