తిరువనంతపురం : కేరళలోనే మరో ఏనుగు మానవ తప్పిదంతో మృతి చెందింది. బాణాసంచా పేలుళ్ల ఘటనతో ఇటీవలే ఓ ఏనుగు చనిపోయింది. ఈ ఏడాది ఎప్రిల్లోనే గర్భంతో ఉన్న ఓ ఏనుగు పేలుడు పదార్థాలు నింపి ఉన్న పైనాపిల్ తినడంతో చనిపోయింది. వన్యప్రాణులను చంపివేసేందుకు వేటగాళ్లు అనేక రకాల మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో పండ్లు తినుబండారాలలో పేలుడు పదార్థాలు ఉంచుతున్నట్లు వెల్లడైంది. ఇటీవలే ఓ ఏనుగు పై కూడా ఇటువంటి తరహాలోనే దాడికి దిగినట్లు తరువాత అది మృతి చెందినట్లు గుర్తించారు. కేరళలో ఇటీవలి కాలంలో తరచూ ఏనుగులు ఇతర జంతువులను అమానుష రీతిలో వధించి చంపుతున్నారు. ఇటువంటి ఘటనలపై తీవ్రంగా స్పందిస్తామని రాష్ట్ర అధికార యంత్రాంగం తెలిపింది. సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ హెచ్చరించారు. ఘటనలపై అటవీశాఖ దర్యాప్తు జరుపుతోందని , దుండగులను చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుందని స్పష్టం చేశారు.