హైదరాబాద్: ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎస్ఎల్బిసిని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 943 కోట్లు ఎస్ఎల్బిసిపై ఖర్చు చేశామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎస్ఎల్బిసి సొరంగం 33 కిలో మీటర్ల మేర పూర్తి అయ్యిందని ప్రశంసించారు. కాంగ్రెస్ పాలనలో మంత్రులుగా చేసిన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా వినియోగానికి సిఎం కెసిఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని గుత్తా కొనియాడారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చాలన్నదే సిఎం కెసిఆర్ సంకల్పమని స్పష్టం చేశారు. డిండి ఎత్తిపోతల పథకంతో దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తామని, తెలంగాణ రాష్ట్రం వచ్చినంకనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామని స్పష్టం చేశారు.