మనతెలంగాణ/హైదరాబాద్ : సినీ నటుడు ప్రభాస్పై రాయదుర్గం పోలీస్స్టేషన్లో మంగళవారం నాడు కేసు నమోదైంది. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు నటుడు ప్రభాస్పై కేసును నమోదు చేశామని రాయదుర్గం సిఐ రవీందర్ తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తోందని, ఇదే సర్వే నెంబర్లో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడని తెలిపారు. జివొ నంబర్ 59 కింద దీన్ని క్రమబద్ధీకరించాలని నటుడు ప్రభాస్ దరఖాస్తు కూడా చేసుకున్నాడు. అయితే ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ గతంలోనే శేరిలింగంపల్లి తహసీల్దార్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో తన గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించేందుకు ప్రభాస్ యత్నించాడని రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూకట్ పల్లి కోర్టులో ట్రయల్ జరగనున్నట్లు తెలిపారు.