ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలుంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష
బీజింగ్ : ఇతర మతాలు, జాతుల పట్ల కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకప్పుడు తమ దేశ జనాభాను తగ్గించడానికి అనుసరించిన కుటుంబ నియంత్రణా పద్ధతుల్ని ఇప్పుడు అక్కడి మైనారిటీలకే పరిమితం చేస్తోంది. కుటుంబ నియంత్రణ పాటించనివారిని వెతికి పట్టుకొని భారీ జరిమానాలు విధించడమేగాక, జైళ్లలో నిర్బంధిస్తోంది. అసోసియేటెడ్ ప్రెస్ నిర్వహించిన పరిశోధనలో చైనా నియంతృత్వ విధానాలు వెలుగు చూశాయి. జిన్జియాంగ్ రాష్ట్రంలో ఉయిఘర్ తెగకు చెందిన ముస్లింలలో కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేస్తున్నట్టు వెల్లడైంది. ఉయిఘర్ మహిళలు ఇద్దరికన్నా ఎక్కువ పిల్లల్ని కనేందుకు వీల్లేదు. తమ గర్భధారణ గురించి అధికారులకు వెంటనే తెలియజేయాలి.
మూడో గర్భధారణ గురించి తెలిస్తే బలవంతంగానైనా గర్భ విచ్ఛిత్తి జరిపిస్తున్నారు. ఇద్దరికన్నా ఎకువ పిల్లల్ని కన్నట్టు తేలితే భారీ జరిమానాలు చెల్లించాలి. లేదంటే జైలుకు వెళ్లాల్సిందే. కఠిన శిక్షలకు భయపడి ఉయిఘర్ మహిళలు కుటుంబ నియంత్రణ పద్ధతుల్ని పాటిస్తున్నారు. దాంతో, జిన్జియాంగ్లో కుటుంబ నియంత్రణ పరికరాలు, ఔషధాల వాడకం పెరిగింది. మరోవైపు మిగతా రాష్ట్రాల్లో వాటి వాడకం తగ్గింది. మైనారిటీల జనాభా పట్ల ఆందోళన చెందుతున్న చైనా, మరోవైపు తమ స్థానిక జాతిగా భావించే హన్ జనాభాను పెంచుకుంటోంది. అందుకు హన్ కుటుంబాలకు ప్రోత్సాహకాలిస్తోంది. జనాభా విషయంలో చైనా అనుసరిస్తున్నది జాత్యహంకార ధోరణిగా విమర్శలొస్తున్నాయి.