ఘజియాబాద్ (యుపి) : గత వారం సూట్కేసులో కుక్కి ఉన్న మహిళా మృతదేహం కేసుపై ఘజియాబాద్ పోలీసులు తిరిగి మంగళవారం దర్యాప్తు చేపట్టారు. మృతురాలుగా భావించిన ఆమె బతికే ఉందని తేలడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. బులంద్షహార్ లోని ఇస్లామాబాద్ ప్రాంతంలోని వరీషా జులై 23 నుంచి కనిపించడం లేదని ఆమె భర్త అమీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జులై 27న ఘజియాబాద్ సమీపంలో సూట్కేసులో కుక్కి ఉన్న మహిళ మృత దేహాన్ని పోలీసులు గుర్తించడం, అమీర్ కుటుంబీకులు కూడా అది వరీషాదేనని తీసుకెళ్లడం అంతా జరిగింది.
పోలీసులు ఆమె డిఎన్ఎ నమూనాలను విజెరా నమూనాలను పరీక్ష కోసం తీసుకున్నారు. అయితే సోమవారం వరీషా తాను బతికే ఉన్నానని పోలీసులకు చెప్పడంతో కేసు మరోమలుపు తిరిగింది. వరకట్నం కోసం వేధింపులు భరించలేక తాను నోయిడా వెళ్లినట్టు పోలీసులకు వివరించింది. పోలీసులు అమీర్ తల్లిపై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా సూట్కేసులో తమకు కనిపించిన యువతి ఎవరో తెలుసుకోడానికి దర్యాప్తు ప్రారంభించారు.