కేరళలో కొండచరియలు విరిగిపడి 24 మంది సజీవసమాధి
మరో 46 మంది కోసం గాలింపు
ఇడుక్కి (కేరళ): కేరళ లోని ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాలకు తేయాకు తోటల కార్మికుల ఇరవై ఇళ్లపై కొండచరియలు విరిగి పడడంతో సజీవ సమాధి అయినవారి సంఖ్య 24కు పెరిగింది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంకా గల్లంతైన 46 మంది కోసం గాలిస్తున్నారు. పోలీస్, ఫైర్సర్వీస్ సిబ్బందితోపాటు స్థానికులు జాతీయ వైపరీత్య నివారణ సహాయ సిబ్బందితో కలసి రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరంగా సాగిస్తున్నారని జిల్లా కలెక్టర్ దినేషన్ చెప్పారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో 12 మందిని శుక్రవారం రక్షించారు. వారికి వైద్యచికిత్సలు జరుగుతున్నాయి.
వాతావరణ విభాగం శనివారం, ఆదివారం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గత 24 గంటల్లో కేరళలో సరాసరి వర్షపాతం 95 మిమీ వర్షపాతం నమోదైంది. వడకర, కోజికోడ్ల్లో 32.7 సెంమీ వర్షపాతం నమోదైంది. పెట్టిముడి కొండచరియ అకస్మాత్తుగా శుక్రవారం తెల్లవారు జామున తేయాకు కార్మికుల ఇళ్లపై కూలిపోవడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. జూన్లో ప్రారంభమైన నైరుతి పవన వర్షాల కారణంగా అనేక ప్రమాదాలు సంభవించి ఇప్పటివరకు కేరళలో 51 మంది మృతి చెందారు.
24 people died due to landslide in Kerala