చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
మొజంజాహీ మార్కెట్ పరిరక్షణ బాధ్యత అందరిపై ఉంది
రూ.15కోట్లు వెచ్చించి పునర్నిర్మించుకోవడం ఆనందదాయకం
మార్కెట్ను ప్రారంభించిన అనంతరం మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలు
విద్యుత్ కాంతుల్లో వెలిగిపోయిన మొజంజాహీ
మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయమైన హైదరాబాద్ నగరానికి యునెస్కో గుర్తింపునకు ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. భాగ్యనగర చారిత్రిక కట్టడాల్లో ఒక్కటైన మోజంజాహి మార్కెట్ను శుక్రవారం మంత్రి కెటిఆర్ పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపిలు కె.కేశవరావు, అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే రాజా సింగ్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతులకు నిలయమన్నారు. నగరంలో చారిత్రక కట్టడాల పరిరక్షణే ప్రభుత్వ లక్షమన్నారు. ప్రభుత్వ కృషికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునుందించాలన్నారు. రెండేళ్ల క్రితం ఈ మార్కెట్ను సందర్శించడం జరిగిందని, అధ్వాన స్థితిలో ఉన్న మార్కెట్ను చూసి చాలా బాధ కలిగిందన్నారు. దీంతో మార్కెట్కు పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పంతో పురపాలక శాఖ నుంచి రూ.15కోట్లు వెచ్చించి పునఃనిర్మించి తిరిగి ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ ఈ మార్కెట్ను దత్తత తీసుకొని స్వయంగా పర్యవేక్షిస్తూ తూదికూపు తెచ్చారని అభినందించారు.
సిఎం సంతోషం చెప్పలేనిది: కెటిఆర్
మోజంజాహి మార్కెట్కు పునరుజ్జీవం కల్పించడం ద్వారా పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ 10 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయడం పట్ల సిఎం కెసిఆర్ ఎంతో సంతోషిస్తారని మంత్రి కెటిఆర్ అన్నారు. కెసిఆర్ చదువుకునే రోజుల్లో మోజంజాహి మార్కెట్కు సమీపంలోని మయూరి హోటల్లో ఉండేవారని గుర్తు చేశారు. గతంలో ఈ మార్కెట్లో విక్రయించే ఐస్క్రీమ్లకు చాలా గుర్తింపు ఉండేదన్నారు. పునరుద్ధరించిన మోజంజాహి మార్కెట్ను పరిరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. రూ.1000కోట్లతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా చారిత్రక, అపురూపమైన, వారసత్వ నిర్మాణాలను ప్రభుత్వం పరిరక్షిస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. అంతకుమందు మోజంజాహి మార్కెట్ వైభవంపై ముద్రించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అదేవిధంగా ఈ మార్కెట్ పునర్వైభవం తీసుకురావడంతో విశిష్ట సేవలందించిన 16మందిని మెమోంటోలతో గౌరవించారు.
Minister KTR Reopened Mozamjahi Market in Hyd