హైదరాబాద్: ఈ నెల 10వ తేదీన రవీంద్రభారతి వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్కు చెందిన బైకెలి నాగులు(55) జై తెలంగాణ అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆత్మహత్యాయత్నం చేయడంతో తీవ్ర కలకలం రేగింది. అక్కడే ఉన్న పోలీసులు మంటలు ఆర్పి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నాగులుకు 63శాతం గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తెలంగాణ వచ్చినా తనకు న్యాయం జరగడంలేదని నాగులు ఆవేదన వ్యక్తం చేశాడు. బతుకు దెరువు కోసం నగరానికి 20ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చిన నాగులు పంజాగుట్ట ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. వచ్చే డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో పిల్లలను ఉన్నతచదువులు చదివించలేకపోతున్నానని గత కొంత కాలం నుంచి ఆవేదన చెందుతున్నాడు. అసెంబ్లీ పరిసరాల్లో తాను ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వమే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తుందని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు.
Man dies after suicide attempt at Ravindra Bharathi