డిసెంబర్ 1 నుంచి 14 వరకు పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పిజి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పిజి ప్రవేశ పరీక్ష(సిపిజిఇటి)- 2020ను వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ ఎన్.కిషన్ ప్రకటించారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం కావాల్సిన సిపిజిఇటి పరీక్షలను డిసెంబర్ 1 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. బిఎ, బి.కాం, బిఎస్సి తదితర డిగ్రీ పరీక్షల తేదీలలో సిపిజిఇటి పరీక్ష ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఐసెట్, లాసెట్, ఎడ్సెట్ వంటి ప్రవేశ పరీక్షలు పూర్తయినా డిగ్రీ ఫలితాలు వెల్లడి కానందున కౌన్సెలింగ్ నిర్వహించడం లేదని, వీరితో పాటు సెంట్రల్ యూనివర్సిటీలు, పలు జాతీయ విద్యాసంస్థలు డిగ్రీ ఫలితాల కోసం వేచిచూస్తున్నారని అన్నారు.
అపరాధ రుసుంతో ఉమ్మడి పిజి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును నవంబర్ 21 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు సిపిజిఇటి పరీక్షకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 17 వరకు, రూ. 2 వేల అపరాధ రుసుంతో ఈ నెల 21 ఫీజు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఇప్పటివరకు రూ.2 వేల ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకున్న సుమారు 50 మంది విద్యార్థులకు రూ.1500 తిరిగి ఇస్తామని తెలిపారు.