కౌంటింగ్ ఏజెంట్లు ప్రతి అంశాన్ని సున్నితంగా చూడాలి
ప్రతి ఓటు విలువైనది : టిఆర్ఎస్ నాయకులతో టెలీకాన్ఫరెన్స్లో మంత్రి కెటిఆర్
హైదరాబాద్: గ్రేటర్ హైదారాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత విలువైందిగా భావించాలని రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరగనున్న నేపథ్యంలో టెలీ కాన్ఫరెన్స్ద్వారా కెటిఆర్ అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. నందినగర్లోని తన నివాసం నుంచి కెటిఆర్ గురువారం టెలీ కాన్ఫరెన్స్లో టిఆర్ఎస్ ముఖ్యనాయకులతో మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రతగా గమనించాలని, ఈ ఎన్నికల్లో ప్రతిఓటు అత్యంత ప్రధాన్యతతో ఉంటుందని, కొన్నిసందర్భాల్లో ఒక్క ఓటు తోనే విజయం సాధించే సందర్భాలు కూడా ఏర్పడతాయని కెటిఆర్ నాయకులకు చెప్పారు. అత్యంత సమర్ధులను టిఆర్ఎస్ కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించాలని టిఆర్ఎస్ ఎన్నికల ఇంఛార్జీలకు బాధ్యతలు అప్పగించారు. రెండు దశాబ్దాల అనంతరం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్లో పాల్గొనేవారు చురుకైన వారు ఉండాలని,బ్యాలెట్ లెక్కింపుపై నాయకులు ఎజెంట్లకు సూచనలు చేయాలని కెటిఆర్ చెప్పారు. పోలింగ్ బూత్లవారిగా ఎంపిక చేసిన టిఆర్ఎస్ కౌంటింగ్ ఏజెంట్లకు నాయకులు తగిన సూచనలు ఇచ్చి ఓట్ల లెక్కింపుకు పంపించాలని కెటిఆర్ చెప్పారు.
టిఆర్ఎస్కు విజయావకాశాలు అధికం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్ఎస్ సంపూర్ణ విజయం సాధించే అవకాశాలు అత్యధికంగా ఉన్నట్లు అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయని కెటిఆర్ టెలీ కాన్ఫరెన్స్లో నాయకులకు గుర్తు చేశారు. సొంతంగా మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాన్ని టిఆర్ఎస్ దక్కించుకోనుందని కెటిఆర్ ధీమావ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు అంశంలో చాలా జాగ్రతలను పాటించాలని, ప్రతి ఓటును పరిశీలించాలని ఆయన తెలిపారు. విపక్షాలు ఓటమిని జీర్ణించుకోలేక ఆవేశాలకుపాల్పడితే తక్షణం ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అనేక సర్వేలు, రిపోర్టులు టిఆర్ఎస్ విజయాన్ని ఖరారు చేస్తున్నాయని ఆయన తెలిపారు. సెంచరీ లక్షంగా టిఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లింది, ఆలక్ష్యాన్ని చేరుకునేలా ప్రజలు తీర్పు ఇచ్చారనే నమ్మకం ఉందన్నారు.
ఎన్నికలఫలితాలను ఎప్పటికప్పుడు విశ్లేషించాలి
150 డిజన్లకు కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో నాయకులు ఫలితాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని కెటిఆర్ చెప్పారు. విపక్షాలు చెలరేగితే తక్షణం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు నాయకులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల తూర్పు టిఆర్ఎస్ పక్షాన ఉంటుందనే ధీమా తనలో ఉందని ఆయన చెప్పారు. కౌంటింగ్ ఏజెంట్లు చివరి వరకు కౌంటింగ్ కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. ఫలితాలు వెలుబడిన అనంతరమే ఏజెంట్లు రావల్సి ఉంటుందన్నారు. ఈటెలీ కాన్ఫరెన్స్లో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, టిఎస్ఐఐసి కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు,మాజీ ఎంఎల్సి కర్నెప్రభాకర్ పాల్గొన్నారు.