* మూడు రోజుల్లో లబ్దిదారులను గుర్తించనున్న బోర్డు
* జనవరి 1వతేదీ నాటి నుంచి పథకం అమలు
* డిల్లీ వాటర్బోర్డు అధికారులతో మంతనాలు
* ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరఫరాకు ప్లాన్
హైదరాబాద్: గ్రేటర్ వాసులకు ఉచిత తాగునీరు పథకం అమలు చేసేందుకు బోర్డు అధికారులు చర్యలు వేగం చేశారు. నూతన సంవత్సరం గడువు ముంచుకొస్తుండటంతో గృహ వినియోగదారులు,కమర్షియల్ కనెక్షన్లు వివరాలు మూడు రోజుల్లో గుర్తించి, అర్హులను జాబితాను ప్రకటించనున్నట్లు బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. గత నాలుగు రోజుల నుంచి స్థానిక డివిజన్ అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అర్హులైన కుటుంబాల నుంచి ఆధార్ కార్డు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నూతన సంవత్సరం తొలి వారం నుంచి నగరంలో ఉచిత తాగునీటి కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఇటీవలే మంత్రి కెటిఆర్ ప్రకటించారు. జలమండలి ద్వారా 20 వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా అందించబోతున్నట్లు చెప్పారు. జనవరిలో వినియోగదారులకు వచ్చే నీటి బిల్లుల్లో 20వేలు లీటర్ల వరకు బిల్లుల ఉండద్దని అధికారులు సూచించారు.
ఇందుకోసం నాలుగు రోజుల నుంచి జలమండలి అధికారులు విధివిధానాలు ఖరారు చేస్తున్నారు. వాటర్బోర్డు ప్రతి నెల రూ. 40కోట్ల లోటు బడ్జెట్ ఉన్న నగర ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా సకాలంలో సరఫరా చేస్తున్నారు. బోర్డులకు నెలకు రూ. 160 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ. 120 కోట్లు రాబడి వస్తుంది. వీటితోనే ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణతో పాటు ఇతర్రతా ఖర్చులకు వినియోగిస్తున్నారు. నగరంలో 10.46 లక్షల నల్ల కనెక్షనులుండగా, వాటి ద్వారా రోజు 460ఎంజిడిల నీరు సరఫరా చేస్తున్నారు. వీటిలో కొన్ని శివారు మున్సిపాలిటీలకు చెందిన కనెక్షన్లులుండగా, వాటిని మినహించి గ్రేటర్ 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న నల్లా కనెక్షన్లలో గుర్తిస్తున్నారు. అంచనా ప్రకారం 8.50లక్షల
కనెక్షన్దారులు ఉచిత నీటి సరఫరాకు అర్హులు కావచ్చని జలమండలి అధికారులు భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఉచిత నీటి సరఫరా సమర్దవంతంగా అమలు చేస్తూ ప్రజలను నుంచి ప్రశంసలు పొందుతుంది. అదే తరహాలో హైదరాబాద్ అమలు చేసేందుకు బోర్డు అక్కడి అధికారులతో ఎప్పటికప్పడు సలహాలు తీసుకుంటూ నూతన సంవత్సరంలో పథకం ముందుకు సాగేందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.