దేశ రక్షణ కోసం సర్వ సన్నద్ధం
యుద్ధ సన్నాహాలలో త్రివిధ దళాలు
రక్షణ దళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశ రక్షణ కోసం ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని రక్షణ దళాల ప్రధానాధికారి(సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. పొరుగు దేశమైన చైనాతో లడఖ్లో ఏర్పడిన ఘర్షణ వాతావరణం నేపథ్యంలో బిపిన్ రావత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భూమి, ఆకాశం, సముద్రం&ఎక్కడి నుంచైనా సరే..దేశాన్ని పరిరక్షించుకోవడానికి తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన ప్రకటించారు. లడఖ్లో చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొందని, దీని పర్యవసానంగా చైనాకు చెదిన టిబెట్ స్వతంత్ర ప్రాంతంలో కొంత అభివృది కార్యకలాపాలు పుంజుకున్నాయని శనివారం నాడిక్కడ ఆయన ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ తెలిపారు. తమ దేశాల ప్రయోజనాలకు అనుగుణంగానే ప్రతి దేశం తన భద్రత విషయంలో కీలక చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
తన ఉత్తర సరిహద్దుల పొడవున వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిలో మార్పులు చేయడానికి చైనా ప్రయత్నాలు సాగిస్తున్న దృష్టా భూమి(సైన్యం), సముద్రం(నౌకాదళం), ఆకాశం(వైమానిక దళం) పైన భారీ స్థాయిలో సన్నాహకాలు జరుగుతున్నాయని రావత్ వెల్లడించారు. ఉత్తర సరిహద్దుల్లో ఎటువంటి ముప్పు లేదా సవాళ్లనైనా ఎదుర్కోవడానికి అవసరమైన సైనిక బలగాలు మనకు ఉన్నాయని ఆయన తెలిపారు.
తూర్పు లడఖ్లో సరిహద్దుల వద్ద చైనాతో ఘర్షణ పరిస్థితులు నెలకొన్న తరుణంలో 15 రోజుల పాటు నిర్విరామ యుద్ధానికి అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేసుకోవాలంటూ రక్షణ దళాలను భారత ప్రభుత్వం ఆదేశించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. యుద్ధానికి అవసరమైన ఎటువంటి పరికరాలనైనా కొనుగోలు చేయడానికి త్రివిధ దళాలకు రూ. 300 కోట్ల విలువైన సామగ్రి కొనుగోలు చేసే ఆర్థిక అధికారాలను కూడా ప్రభుత్వం అప్పగించింది.
India Prepared to Fight for any Eventuality: Bipin Rawat