నిందితుల్లో చైనా మహిళ, 101 ల్యాప్టాప్లు, 106 మొబైల్ ఫోన్లు స్వాధీనం
పుణెలో కాల్ సెంటర్ నిర్వహణ, 650 మంది టెలీకాలరు
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్భగవత్
మన తెలంగాణ/సిటీబ్యూరో: యాప్ల ద్వారా లోన్లు ఇచ్చి వేధింపులకు గురిచేస్తున్న ముగ్గురు నిందితులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 101ల్యాప్టాప్లు, 106 మొబైల్ ఫోన్లు, సిసి కెమెరాల డివిఆర్, రూ.1.42 కోట్ల బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తన క్యాంపు కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, ఫుణే, కామ్షీట్కు చెందిన పరుశురాం లాహు టక్వే, చైనాకు చెందిన లియాగ్ టియాన్టియాన్ భార్యాభర్తలు, ఎస్కె ఆకిబ్ విద్యార్థి కలిసి యాప్ల ద్వారా పలువురికి లోన్లు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఉప్పల్కు చెందిన భూమన ప్రసాద్ మై బ్యాంక్ యాప్లో నవంబర్ 18న రూ.3,500 లోన్ తీసుకుని చెల్లించాడు. తర్వాత రూ.4,500 తిరిగి లోన్ తీసుకుని చెల్లించాడు. కొద్ది రోజుల తర్వాత తన బ్యాంకు ఖాతాను చూసుకోగా రూ.26,000 విత్డ్రా అయినట్లు ఉంది. ఈ డబ్బులు 14 యాప్లు బుబుల్ లోన్, రూపీబజార్, ఓకె క్యాష్, రూపీ ఫ్యాక్టరీ, పైసా లోన్, ఒన్ హోప్, క్యాష్బీఅ, ఇన్ నీడ్, స్నాపిట్ లోన్, క్యాష్లో, పిగ్గీ బ్యాంక్, క్రేజీ రూపీ, రియల్ రూపీ, రూపీ మోస్ట్ ద్వారా దాదాపు రూ.44,000 బాధితుడికి తెలియకుండా క్రెడిట్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా డిపాట్ ట్రాప్ మైక్రో ఫైనాన్స్ ప్రతినిధులు ఫోన్లు చేసి డబ్బుల కోసం వేధించడం ప్రారంభించారు.
బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరశురాం లహు, లియాంగ్ టియన్టియాన్ 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. చైనాకు చెందిన లియాంగ్ డిపెండెంట్ వీసాపై ఇండియాకు వచ్చింది. వీరికి 2016లో పాప పుట్టింది, తర్వాత హైపర్టెల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కోరేగావ్లో బిపిఓ ఏర్పాటు చేశాడు. మార్చి, 2020లో దానిని మూసివేశాడు, జూన్, 2020లో మళ్లీ ప్రారంభించాడు. ఫుణెలో జియాలియాంగ్ ఇన్ఫో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించాడు. పరుశురాం టెక్వే, అమిత్ నందు కాల్భోహర్ కంపెనీని నిర్వహిస్తున్నాడు పరారీలో ఉన్నాడు. అకిబ్ షేక్ హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కంపెనీలో టెలీకాలర్లను నియమించుకుని రుణాలు ఇస్తు తీసుకున్న వారికి ఫోన్లు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. లోన్ తీసుకున్న వారి వద్ద నుంచి 25 నుంచి 30శాతం వడ్డీని తీసుకుంటున్నారు. ముందుగా ఏడు రోజుల్లో అప్పు తీర్చాలనే నిబంధనను పెడుతున్నారు తర్వాత 15రోజుల్లో చెల్లించాలి లేకుంటే అధికంగా వడ్డీ వేస్తున్నారు. సమయానికి డబ్బులు చెల్లించకపోతే లోన్ తీసుకున్న వారిని బండబూతులు తిట్టడమే కాకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్స్పెక్టర్ ప్రకాష్, లక్ష్మికాంత్ రెడ్డి, కెవి విజయ్ కుమార్ కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Chinese woman Arrested in Instant Loan App Fraud