ముంబై: కరోనా తీవ్రత ఆందోళన కలిగిస్తున్నా ముంబైలో ఐపిఎల్ మ్యాచ్లు యథాతథంగా కొనసాగుతాయని మహారాష్ట్ర మంత్రి నవాజ్ మాలిక్ స్పష్టం చేశారు. ముంబైలో కరోనా కేసులు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నా ఐపిఎల్ మ్యాచ్ల నిర్వహణపై దాని ప్రభావం ఉండదన్నారు. షెడ్యూల్ ప్రకారమే ముంబైలో ఐపిఎల్లు జరుగుతాయన్నారు. కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో పాల్గొనే క్రికెటర్లకు, అధికారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు మంత్రి వివరించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ముంబైలో జరిగే ఐపిఎల్ మ్యాచ్లను ఇతర వేదికలకు మార్చుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. యథాతథంగా మ్యాచ్లు ముంబైలోనే జరుగుతాయన్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో ఐపిఎల్ నిర్వాహకులు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. బయోబబుల్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఇక ఆటగాళ్లు, టోర్నీతో సంబంధం ఉన్న వాళ్లకే స్టేడియంలో అనుమతి ఇస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు స్టేడియంలో ప్రవేశం ఉండదన్నారు. మరోవైపు ముంబై నగరంలో రాత్రి పూట కర్ఫూ అమలులో ఉన్నా దాని ప్రభావం ఐపిఎల్ మ్యాచ్ల నిర్వహణపై పడదని మంత్రి స్పష్టం చేశారు.
Maha Govt paves way for IPL 2021 Matches