భోపాల్ : మధ్యప్రదేశ్లోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సంబంధించి కీలకమైన ప్రతిపాదన చేసింది. అత్యవసర విభాగాల కిందికి రాకుండా ఉన్న ఉద్యోగులకు 5 సంవత్సరాల సెలవు, ఈ కాలంలో వారికి సగం జీతం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ విధంగా చేస్తే ఏడాదికి రూ 6000 కోట్ల వరకూ ఆదా చేసుకోవచ్చునని అంచనా వేసినట్లు రాష్ట్ర ఆర్థిక విభాగం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కరోనా, లాక్డౌన్ ఇతర కారణాలతో రాష్ట్రానికి రుణభారం ఇప్పటికే రూ 2.53 లక్షల కోట్ల స్థాయికి చేరి ప్రభుత్వానికి బహు భారంగా మారింది. దీనిని తట్టుకునేందుకు సాధ్యమైనన్ని ఆదామార్గాలు పాటించేందుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ యత్నిస్తున్నారు. ఈ దిశలో ఉద్యోగుల రేషనింగ్ పద్థతికూడా ఉందని, అయితే ఇది ఇప్పటికీ కేవలం పరిశీలనలో ఉందని, అన్ని స్థాయిలలో ఆలోచించుకునితుది నిర్ణయం తీసుకుంటారని అధికారులు తెలిపారు.