న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంలో పార్ల్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం విపక్ష పార్టీల ఎంపీలు, ఆయా సభాపక్ష నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్లో జరిగిన ఈ అల్పాహార విందు భేటీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిలతో పాటుగా తృణమూల్ కాంగ్రెస్, ఎన్సిపి, శివసేన, సిపిఎం, సిపిఐ, ఆర్జెడి, సమాజ్వాది పార్టీలకు చెందిన నేతలు దాదాపు 100 మంది హాజరయ్యారు. జెఎంఎం, జెకెన్సి, ఆర్ఎస్పి, కెసిఎం, ఆర్ఎస్పిలాంటి ప్రాంతీయ పార్టీ ల నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంతకు ముందు రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన విపక్షాల భేటీకి గైరుహాజరైన తృణమూల్ కాంగ్రెస్ ఈ రోజు సమావేశానికి రావడం విశేషం. రాహుల్ గాంధీతో పాటుగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, కెసి వేణుగోపాల్, జైరాం రమేశ్ తదితర సీనియర్ నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
అల్పాహార విందు సమావేశానికి 17 పార్టీల నేతలను ఆహ్వానించారు కానీ ఆమ్ ఆద్మీపార్టీ, బిఎస్పి గైరుహాజరయ్యాయి. పెగాసస్ వ్యవహారంపై పార్లమెంటులో పది రోజులకు పైగాప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రతిపక్షాల సమావేశం జరగడం గమనార్హం. పెగాసస్పై ప్రభుత్వంపై విరుచుకు పడే ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. పెగాసస్ వ్యవహారం, రైతలు సమస్యలు, పెరుగుతున్న ధరలు వంటి అంశాలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఎవరూ వినిపించుకోవడం లేదని, అందుకే ప్రతితిపక్షాలు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించుకోవడం కోసం సమావేశమయ్యాయని సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు సంఘటితంగా ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. సమావేశానికి హాజరైన నేతల్లో కళ్యాణ్ బెనర్జీ, మొహువా మొయిత్రా( టిఎంసి), సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది( శివసేన) మనోజ్ ఝా( ఆర్జెడి), కనిమోళి( డిఎంకె), రాంగోపాల్ యదవ్( ఎస్పి) తదితరులున్నారు.