న్యూఢిల్లీ : కేరళలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడం, కొవిడ్ రోగుల్లో 85 శాతం మంది ఇళ్ల వద్దనే ఐసొలేషన్లో ఉండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. రోజువారీ కేసులు పెరగకుండా మరింత నియంత్రణ చర్యలు అవసరమని, స్మార్ట్ అండ్ స్ట్రాటజిక్ (వ్యూహాత్మక ) లాక్డౌన్ విధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దేశం లోనే కేసులు కేరళలో ఎక్కువగా పెరుగుతుండగా కేంద్రం సూచించే సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని ఆరోపించింది. మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర సమీప ప్రాంతాల్లో కూడా ఆంక్షలు విధించాలని సూచించింది.
ఇంటి దగ్గర కోలుకుంటున్న రోగులు నిబంధనలు పాటించడం లేదని, ఈ కారణం గానే రాష్ట్ర ప్రభుత్వం కరోనాను అదుపు చేయలేక పోతోందని పేర్కొంది. కోస్తా ప్రాంతమైన కేరళ శెలవుల్లో పర్యాటక గమ్యంగా పేరొందిందని, అందువల్ల పర్యాటకుల కదలికల పైన, కంటైన్మెంట్ జోన్ల పైన నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. కేరళలో వారం వారీ కరోనా పాజిటివ్ రేటు 14 నుంచి 19 శాతంగా ఉంటోంది. ఇరుగుపొరుగు రాష్ట్రాలకు కూడా ఇది విస్తరించ వచ్చు. కేరళ నుంచి వచ్చే వారికి ఏడు రోజుల పాటు వ్యవస్థాపరమైన క్వారంటైన్ను కర్ణాటక అమలు చేస్తోంది.