అయోధ్య పుస్తకంలో కాంగ్రెస్ నేత ఖుర్షీద్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తన అయోధ్య పుస్తకంతో వివాదంలో చిక్కారు. హిందూత్వను ఆయన తీవ్రవాద ఇస్లామిక్ ఉగ్రసంస్థలతో ఈ రచనలో పోల్చారు. దీనిపై నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఢిల్లీకి చెందిన ఓ లాయర్ ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. అయోధ్య కేంద్ర బిందువుగా సల్మాన్ ఖుర్షీద్ తాజా పుస్తకం వెలువడింది. యుపి ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అయోధ్య అంశంపై రాసిన పుస్తకంలోని పలు అంశాలు చర్చకు దారితీశాయి. వివాదాస్పదం అయ్యాయి. ఎన్నికలలో ఓట్లను రాబట్టుకోవడానికే కాంగ్రెస్ నేత పార్టీ ప్రోద్బలంతోనే హిందూత్వపై దాడికి దిగారని పిటిషనర్ ఆరోపించారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఖుర్షీద్ను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ నేత రాతలపై వివరణ ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది. హిందువుల పట్ల సోనియాకు గౌరవం ఉన్నది లేనిది ఆమె వెలువరించే ప్రకటనతోనే స్పష్టం అవుతుందన్నారు. ఖుర్షీద్ తాజా పుస్తకం సన్రైజ్ ఓవర్ అయోధ్యః నేషన్హుడ్ ఇన అవర్ టైమ్స్’లో హిందూత్వను కించపరిచే విధంగా వ్యాఖ్యలకు దిగారని విమర్శలు తలెత్తాయి. సనాతన ధర్మాలు, ప్రాచీన హిందూయిజలో విజ్ఞులు , సాధువులు ప్రవచించిన అంశాలను ఇప్పటి హిందూత్వవాదం గంగలో కలిపింది. ఇదంతా కూడా రాజకీయ వాదనను సంతరించుకుంది. చివరికి ఇటీవలి కాలంలో ఇటువంటి ధోరణితో హిందూత్వ ఐఎస్ఐఎస్, బోఓ హరామ్ వంటి జిహాదీ ఇస్లామిక్ సంస్థల సరసన చేరిందని వ్యాఖ్యానించారు.