Friday, April 26, 2024

అమెరికాలో ముదురుతోన్న బ్యాంకింగ్ సంక్షోభం

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్/ న్యూఢిల్లీ : అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. ఈ కారణంగానే బ్యాంకింగ్ సంక్షోభం మరింత ముదురుతోంది. అమెరికాలోని రెండు పెద్ద బ్యాంకులు సిలికాన్ వాలీ, సిగ్నేచర్ బ్యాంక్‌లు మూసివేతకు గురయ్యాయి. ఇప్పుడు అమెరికా ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కష్టాల్లో ఉంది. అదే సమయంలో అమెరికన్ బ్యాంకింగ్ సంక్షోభం ప్రభావం ఇప్పుడు యూరప్‌కు చేరుకుంది. యూరప్‌లోని అతిపెద్ద పెట్టుబడి బ్యాంకులలో ఒకటైన క్రెడిట్ సూయిస్ ఆర్థిక ఆరోగ్యం క్షీణించింది. క్రెడిట్ సూయిస్ పెట్టుబడిదారులు, కస్టమర్ల విశ్వాసం దెబ్బతిన్నది. 2008లో అమెరికా అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన లెమాన్ బ్రదర్స్ పతనం గురించి అంచనా వేసిన ఆర్థికవేత్త రాబర్ట్ కియోసాకి కూడా క్రెడిట్ సూయిస్‌ను క్లెయిమ్ చేశారు. క్రెడిట్ సూయిస్ ప్రమాదం ఇంకా పోలేదని అన్నారు. స్విస్ సెంట్రల్ బ్యాంక్ నుంచి 54 బిలియన్ డాలర్ల రుణం పొందినా క్రెడిట్ సూయిస్ కష్టాలు తగ్గలేదు.

కష్టాల్లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్

మొదట సిలికాన్ వ్యాలీ బ్యాంక్, ఆ తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ మూతపడ్డాయి. ఇక అమెరికా ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కష్టాల్లో ఉంది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను కాపాడేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ని కాపాడేందుకు అమెరికా బ్యాంకుల బృందం కనీసం 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్లాన్ చేసింది. బ్యాంక్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌ల తర్వాత ఫస్ట్ రిపబ్లిక్ మునిగిపోతుందని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో ఈ రిలీఫ్ ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నారు. జెపిఎస్ మోర్గాన్ చేజ్, సిటీ గ్రూప్, వెల్స్ ఫార్గో, గెల్డ్‌న్ సాచ్‌లు ఈ గ్రూప్‌లో భాగమని మీడియా వర్గాలు తెలిపాయి.

దివాలా రక్షణ కోసం ఎస్‌విబి ఫైనాన్షియల్ దాఖలు

అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్‌విబి) మాతృ సంస్థ ఎస్‌విబి ఫైనాన్షియల్ దివాలా రక్షణ కోసం దాఖలు చేసుకుంది. చాప్టర్ 11 దివాలా రక్షణ కింద కోర్టు పర్యవేక్షణ కోసం శుక్రవారం అభ్యర్థించింది. ఎస్‌విబిని అమెరికా రెగ్యులేటర్ల నియంత్రణలోకి తీసుకున్న తర్వాత కొద్ది రోజులకు ఎస్‌విబి ఫైనాన్షియల్ ఈ నిర్ణయానికి వచ్చింది. దివాళా చర్యల కోసం దరఖాస్తుతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొనగా, శుక్రవారం అమెరికా మార్కెట్లలో బ్యాంక్ షేర్లు 1 నుంచి 2 శాతం వరకు పతనమయ్యాయి.

భారత స్టార్టప్‌లకు రూ.8,254 కోట్ల డిపాజిట్లు: కేంద్ర మంత్రి

ట్రబుల్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌విబి)లో భారతీయ స్టార్టప్‌లు సుమారు 1 బిలియన్ డాలర్లు లేదా రూ. 8,254 కోట్ల డిపాజిట్లను కలిగి ఉన్నాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. దేశంలోని స్థానిక బ్యాంకులు ఇప్పుడు భారతీయ స్టార్టప్‌ల కోసం ముందుకు రావాలని అన్నారు. స్టార్టప్‌లకు గరిష్ట నిధులు ఇవ్వడం ద్వారా వారికి సహాయం చేయాలని ఆర్థికమంత్రికి సూచించినట్లు చంద్రశేఖర్ చెప్పారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గురువారం ఆలస్యంగా ట్విట్టర్‌లో లైవ్ సెషన్‌లో ఈ విషయం వెల్లడించారు. స్టార్టప్‌లు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు ఎలా మారాలి? మనం భారతీయ బ్యాంకులపై ఆధారపడటాన్ని పెంచుకోవాలనే విషయమై వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News