Monday, April 29, 2024

కుమారుడికి పునర్జన్మ ఇచ్చిన తల్లి

- Advertisement -
- Advertisement -

21 ఏళ్ల వయసులోనే మూత్రపిండాల సమస్య
తన కిడ్నీ దానం చేసిన కన్న తల్లి

మన తెలంగాణ/ హైదరాబాద్ : అతి చిన్న వయసులోనే కిడ్నీ సమస్య వచ్చిన ఓ యువకుడికి అతడి తల్లి తన కిడ్నీ దానం చేసి ప్రాణాలు పోశారు. నగరంలోని ఏఐఎన్ ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు, ట్రాన్స్ ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ చల్లా రాజేంద్రప్రసాద్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన 21 ఏళ్ల విద్యార్థి గత రెండు మూడేళ్ల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. నిజానికి అప్పటికే అతడికి బీపీ పెరిగినా ఆ విషయాన్ని గుర్తించలేకపోయాడు. కొన్నాళ్ల తర్వాత నుంచి బరువు గణనీయంగా తగ్గిపోయి ఆకలి కూడా ఏమాత్రం లేదు. దాంతో దగ్గరలో ఉన్న ఒక వైద్యుడి వద్దకు వెళ్లగా మూత్రపిండాలు దెబ్బతిన్న విషయం గమనించి, ఏఐఎన్‌యూకు పంపినట్లు చెప్పారు. ఇక్కడకు వచ్చిన తర్వాత మరింత కుణ్ణంగా పరీక్షలు చేయగా, అతడికి రెండు కిడ్నీలూ 10 సెంటీమీటర్ల పరిమాణంలో ఉండాల్సినవి ఏడు సెంటీమీటర్లకు తగ్గిపోయాయి. సాధారణంగా ఇలాంటప్పుడు డయాలసిస్, కిడ్నీ మార్పిడి మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇతడి కేసులో ఇంకా చాలా జీవితం ఉండటం వల్ల కిడ్నీ మార్పిడి మంచిదని నిర్ధారించినట్లు తెలిపారు. అతడి తల్లికి 42 ఏళ్లు కావడంతో ఆమె అతడికి తన కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఇటీవలే ఆమె నుంచి కిడ్నీ తీసి ఇతడికి అమర్చి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని వివరించారు.
తగిన జాగ్రత్తలతో సుదీర్ఘ జీవితం..
కిడ్నీ మార్పిడి చేయించుకోవడంపై కొంతమందిలో ఇప్పటికీ అపోహలు ఉన్నాయి. కానీ, నేను 18 ఏళ్ల క్రితం మొదటిసారి కిడ్నీ మార్పిడి చేసిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇప్పటికీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఇలా 17, 18 ఏళ్ల క్రితం మార్పించుకున్న వారు సైతం ఇప్పుడూ బాగున్నారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న తర్వాత మూడు నెలలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత కూడా జీవనశైలి విషయంలో చాలా మార్పులు చేసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. జీవితాంతం కొన్ని మందులు వాడుతుండాలి. అలా చేస్తే సుదీర్ఘకాలం పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం గడపవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News