2022 అసెంబ్లీ పోరుపై కేజ్రీవాల్ ప్రకటన
అహ్మదాబాద్: గుజరాత్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గుజరాత్లో ప్రస్తుత దుస్థితికి అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆయన ఆరోపించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై వారి స్వరాష్ట్రంలో ఆయన నేరుగా పేరు పెట్టి విమర్శించకపోవడం గమనార్హం.
ఇక్కడి వైష్ణవాలయం వల్లభ్ సదన్ మందిరాన్ని సోమవారం సందర్శించిన కేజ్రీవాల్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గుజరాత్లో బిజెపి, కాంగ్రెస్లకు సరైన ప్రత్యామ్నాయం తమ పార్టీ మాత్రమేనని అన్నారు. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఎప్పుడూ ఉంటుందని ఆయన ఆరోపించారు. 2022లో జరిగే ఎన్నికల్లో గుజరాత్ అసెంబ్లీలోని 182 స్థానాలకు ఆప్ పోటీ చేస్తుందని, బిజెపి, కాంగ్రెస్లకు తామే సరైన ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు. గుజరాత్లో వచ్చే ఏడాది మార్పు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత 27 ఏళ్లుగా గుజరాత్లో బిజెపి అధికారంలో ఉందని, కాంగ్రెస్ కూడా బిజెపి చెప్పుచేతల్లోనే ఉన్నట్లు తనకు ఇక్కడి ప్రజలు చెప్పారని ఆయన అన్నారు.