Wednesday, May 1, 2024

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా వేసిన ఎసిబి కోర్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ , చంద్రబాబును కస్టడీకీ కోరుతూ సిఐడి దాఖలు చేసిన కస్టడి పిటిషన్‌లు విజయవాడ ఎసిబి కోర్టు ఇంఛార్జి న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. మంగళవారం ఎసిబి కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది. ఎసిబి కోర్టు న్యాయమూర్తి మంగళవారం సెలవు పెట్టారు. దీంతో ఈ పిటిషన్లు విచారించాలని కోరుతూ న్యాయవాదులు ఎసిబి ఇంఛార్జి కోర్టు ముందు ప్రస్తావించారు. కస్టడి పిటిషన్‌పై చంద్రబాబు తరుపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను బుధవారానికి వాయిదా వేస్తున్నామని కోర్టు ఇంఛార్జి న్యాయమూర్తి వెల్లడించారు. అయితే మంగళవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని చంద్రబాబు తరుపు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరారు. మంగళవారం పిటిషన్‌పై విచారణ జరిపి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యపడదని బుధవారం నుంచి తాను సెలవుపై వెళుతున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. బుధవారం రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలన్న న్యాయమూర్తి పేర్కొన్నారు.

అంగళ్లు ఘటన: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి
తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..
అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తనపై పెట్టిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎపి హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఆయన న్యాయవాదులు, మరోవైపు పోలీసుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మంగళవారం హైకోర్టులో వాదనలు ముగియగా న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఇక, అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చంద్రబాబుపై ఉన్న పలు కేసుల్లో పోలీసులు ఎసిబి కోర్టులో పిటి వారెంట్ కోరుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే ఆంగళ్ల ఘటనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు ఉండటంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక, స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి విదితమే.

రింగ్ రోడ్డు కేసు విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు
వర్చువల్ గా వాదనలు వినిపించిన లూథ్రా
అమరావతి రింగ్ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఎపి హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్ గా వాదనలు వినిపించారు. లేని రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుపై కేసు పెట్టారని ఆయన కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని ఆరోపించారు. మరోవైపు సిఐడి తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగియడంతో విచారణను జడ్జి బుధవారానికి వాయిదా వేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News