మొబైల్ ఫోన్ చోరీ చేశాడని హత్య
కొట్టిచంపి, కాల్చిచంపిన నిందితులు
ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన డిసిపి
హైదరాబాద్: ఈ నెల 21వ తేదీన హత్యకు గురైన యువకుడి కేసులో నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. వారి వద్ద నుంచి ఆటో, మూడు మొబైల్ ఫోన్లు, బైక్, ప్లాస్టిక్ టిన్, లైటర్ను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్గిరి డిసిపి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాలానగర్, ఐడిపిఎల్ కాలనీకి చెందిన బాలరాజు(22) ఈ నెల 21వ తేదీన హెచ్ఎండిఏ ప్లాట్ కాలిన స్థితిలో హత్య చేయబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. నాగర్కర్నూలు జిల్లాచ వెల్దండ, బొల్లంపల్లి గ్రామానికి చెందిన మహేష్, నేమిలిగుంది తండాకు చెందిన నరేష్, సుధీర్, విజయ, కేతావత్ రవి కలిసి బాలరాజును హత్య చేశారు. మహేష్కు బాలరాజు గత ఆరేళ్ల నుంచి స్నేహితుడు. ఈ క్రమంలోనే ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు మహేష్ తన స్నేహితులు నాగరాజు, సాయిలతో కలిసి వెళ్లి సనత్నగర్లోని కల్లు కాంపౌండ్కు వెళ్లి కల్లుతాగున్నారు.
అదే సమయంలో బాలరాజు అక్కడికి రాగా అందరూ కలిసి సాయంత్రం కల్లుతాగారు. మహేష్ తన ఆటోలో బాలరాజును అతడి ఇంటి వద్ద దింపివెళ్లాడు. కొద్ది దూరం వెళ్లగానే మొబైల్ ఫోన్ కన్పించలేదు. వెంటనే తిరిగి వచ్చి బాలరాజును అడిగాడు, మొబైల్ ఫోన్ గురించి తనకు తెలియదని చెప్పాడు. తన స్నేహితులతో కలిసి బాలరాజును ఆటోలో ఎక్కించుకుని చిలుకానగర్లోని తన ఇంటికి తీసుకుని వచ్చాడు. అక్కడ బాలరాజును తీవ్రంగా కొట్టాడు. దెబ్బలను తట్టుకోలేక మొబైల్ ఫోన్ను తను పనిచేస్తున్న కిరాణ షాపు యజమాని దేవేందర్కు ఇచ్చినట్లు చెప్పాడు. వెంటనే మహేష్ కిరాణ షాపు యజమానికి ఫోన్ చేసి అడుగగా తనకు బాలరాజు ఫోన్ ఇవ్వలేదని చెప్పాడు. రాత్రి 9గంటలకు మహేష్ స్నేహితులు సాయి, నాగరాజు అక్కడి నుంచి వెళ్లి పోయారు. రాత్రి 10.30గంటలకు ఇంటికి వచ్చిన మహేష్ సోదరులు నరేష్, సుధీర్ కలిసి బాలరాజును మొబైల్ ఫోన్ కోసం విపరీతంగా కొట్టారు. దెబ్బలకు తట్టుకోలేక మృతిచెందాడు.
దీంతో ఆందోళన చెందిన ముగ్గురు బాలరాజు మృతదేహాన్ని ఆటోలో వేసుకుని కిరోసిన్ డబ్బాతో ఉప్పల్లోని హెచ్ఎండిఏ లేఅవుట్కు వచ్చారు. సుధీర్ నాగోల్ మొయిన్ రోడ్డుపై ఉండగా, మహేష్, అతడి భార్య విజయ, అన్న నరేష్ కిరోసిన్ పోసి నిప్పు అంటించి అక్కడి నుంచి పారిపోయారు. అక్కడి నుంచి మహేష్ బావ రవి ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పి ఆశ్రయం పొందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ సాయంతో కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఉప్పల్ ఇన్స్స్పెక్టర్ గోవింద్ రెడ్డి, ఎస్సైలు అంజయ్య, జయరాం, మైబేలి తదితరులు కేసు దర్యాప్తు చేశారు.