మనతెలంగాణ/హైదరాబాద్: ఆరేళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి ఆపై దారుణంగా హతమార్చిన నిందితుడి రంగారెడ్డి జిల్లా కోర్టులో దోషిగా తేలడంతో ధర్మాసనం మంగళవారం నాడు ఉరి శిక్ష విధించింది. దీంతో పాటు వెయ్యి రూపాయల జరిమానాను విధించింది. సైబరాబాద్ కమీషనరేట్ లిమిట్స్లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2017 సంవత్సరంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరు సంవత్సరాల చిన్నారిని నిందితుడు దినేష్ చాక్లెట్ ఇప్పిస్తానంటూ తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. చిన్నారి తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు నిందితుడు దినేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కేసుకు సంబంధించిన పూర్వపరాలు పరిశీలించిన న్యాయస్థానం నిందితుడు దినేష్పై నేరారోపణలు రుజువు కావడంతో మరణ శిక్ష ఖరారు చేసింది. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం ఎనిమిది మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య కేసుల్లో న్యాయస్థానాలు ఏడుగురికి మరణశిక్ష విధించాయి. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధికి వచ్చేసరికి నార్సింగి పోలీసు స్టేషన్ లిమిట్స్లో జరిగిన ఈ కేసులోనే తొలి మరణశిక్ష పడింది. ఈ శిక్షపై స్పందించిన సిపి సజ్జనార్ నిందితులకు శిక్షలు పడే విధంగా పోలీసులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పక్క సాక్ష్యాలతో నిందితులకు శిక్షలు పడే విధంగా మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు.