Saturday, May 4, 2024

ఆర్టీసి సిబ్బందిపై దాడులకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం!

- Advertisement -
- Advertisement -

దాడులను ఉపేక్షించబోం
టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ హెచ్చరిక

మనతెలంగాణ/హైదరాబాద్:  ఆర్టీసి సిబ్బందిపై దాడులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని, దాడులను ఉపేక్షించబోమని టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ హెచ్చరించారు. టిఎస్‌ఆర్టీసి సంస్థకు సిబ్బంది వెన్నెముక అని, వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారని, సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనుగడ సాధ్యమని ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు. ఆర్టీసి సిబ్బందిపై దాడులకు పాల్పడడం, దూషించడం, దాడులు చేయడంపై ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

ఇలాంటి ఘటనలకు టిఎస్ ఆర్టీసి యాజమాన్యం ఏమాత్రం సహించదన్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించి క్షేమంగా వారిని గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎండి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని ఆయన ట్విట్టర్ వేదికగా సూచించారు. కొత్తగూడెంలో బస్సు డ్రైవర్‌పై ఆటో డ్రైవర్లు దాడి చేయడం, భద్రాచలంలో మహిళా కండక్టర్‌ను ప్రయాణికులు దూషించిన ఘటనల నేపథ్యంలో ఎండి సజ్జనార్ సీరియస్ అయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News