Friday, April 26, 2024

సిబిఐ, ఇడి దాడులతో దొంగలంతా బిజెపిలో చేరిపోయారు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సిబిఐ, ఇడి దాడుల కారణంగా అవినీతిపరులంతా ఒకే పార్టీలో చేరిపోయారని, బిజెపి పాలన అంతమైతే దేశం అవినీతిరహితంగా మారిపోతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ఏ అవకాశాన్ని బిజెపి వదులుకోలేదని ఆరోపించారు. సిబిఐ, ఇడి అవినీతిపరులందరినీ ఒకే పార్టీలోకి తీసుకువచ్చాయని ఆయన అన్నారు. దొంగలు, దోపిడీదారులు, అవినీతిపరులు అందరూ ఒకే పార్టీలో చేరిపోయారని ఆయన ఆరోపించారు. వారి ప్రభుత్వం అంతమైన తర్వాత బిజెపి నాయకులంతా జైళ్లలో ఉంటారని, అప్పుడు దేశం అవినీతి రహితంగా మారిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆప్ ఎమెఎ్మల్యేలను సిబిఐ, ఇడి దాడులతో బెదిరించారని, రూ. 25 కోట్ల ముడుపుల ఆశచూపినా తమ వారు లొంగలేదని కేజ్రీవాల్ తెలిపారు. మాలో ప్రతి ఒక్కరూ ఒక్కో వజ్రమని, జైళ్లకు వెళ్లాల్సి వస్తుందని భయపడవద్దని, మీ కుటుంబాన్ని తాను చూసుకుంటానని కేజ్రీవాల్ ఆప్ ఎమ్మెల్యేలకు అభయమిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీలో జరుగుతున్న సరిణామాలు దేశంలో ప్రాజాస్వమ్యానికి సానుకూల సందేశాన్ని పంపుతాయని ఆయన అన్నారు. బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు అఢికారంలో ఉన్న ప్రభుత్వాలను పనిచేయకుండా అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు.

2025లోనే కాదు 2050లో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి గెలిచే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తాము ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తామని, అందుకే తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం సాధ్యం కాని బిజెపి ఎమ్మెల్యేలకు విశ్వాస తీర్మానంపై మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆయన అన్నారు. బిజెపి ఎమ్మెల్యేలకు కొట్లాడటం, తిట్టడం తప్ప సద్విమర్శలు చేయడం రాదని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News