Saturday, April 27, 2024

9 మందితో నేడు మరో జాబితా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్లూసీ), కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఆదివారం రాహుల్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అటు నుంచి నేరుగా ఢిల్లీ కి వెళ్లారు. ఈ క్రమంలోనే సిఎం రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ, సీఈసీ మీటింగ్‌లో పాల్గొననున్నారు. కాగా, నేడు జరిగే సమావేశంలో లోక్ సభ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించనున్నా రు. ఇప్పటికే తెలంగాణ నుంచి తొలి జాబితాలో కాంగ్రెస్ నలుగురు అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన 13 మంది అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. అయితే నేటి సీఈసీ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే అందులో 9 మందితో కూడిన జాబితాను నేడు (మంగళవారం) రాత్రిలోగా ఏఐసిసి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగిలిన నాలుగు స్థానాలను (ఖమ్మం, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, భువనగిరి స్థానాలను పెండింగ్‌లో పెట్టి) నాలుగైదు రోజుల్లో ఆ స్థానాల అభ్యర్థులను వెల్లడించే అవకా శం ఉన్నట్టుగా తెలిసింది. ఈ నాలుగు స్థానాలను చివరి దాకా లాగి ఫ్లాష్ సర్వే, అప్పటి పరిస్థితులను బేరీజు వేసుకున్న తరువాత ఫైనల్ చేస్తారన్న చర్చ సాగుతోంది. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమోదించడంతో పాటు ఎన్నికల ప్రచారం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ హైకమాండ్ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నట్టుగా తెలిసింది.
కొత్తగా చేరిన వారి బలాబలాలపై చర్చ..
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత అధిష్టానంతో సిఎం రేవంత్ తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, మిగిలిన లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అధిష్ఠానంతో సిఎం రేవంత్ చర్చించినట్టుగా తెలిసింది. దీంతోపాటు కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎంపి టికెట్‌లు ఇచ్చే విషయమై కూడా ఆయన అగ్రనేతలకు వివరించినట్టుగా సమాచారం. కాంగ్రెస్ ప్రకటించని 13 నియోజకవర్గాల్లో వారం క్రితం సునీల్ కనుగోలు చేపట్టిన ప్లాష్ సర్వే ఆధారంగా అధిష్ఠానం అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించగా సిఎం రేవంత్ ఆయా నియోజకవర్గాల్లో కొత్తగా పార్టీలో చేరిన నాయకుల బలాబలాల గురించి కాంగ్రెస్ అగ్రనాయకులకు తెలియచెప్పినట్టుగా తెలిసింది. చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావించింది. బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో సీన్ మారిపోయింది. ప్లాష్ సర్వేలో ఎంపి రంజిత్‌రెడ్డికి అనుకూలంగా రావడంతో సునీతా మహేందర్ రెడ్డిని చేవెళ్ల నుంచి పక్కన పెట్టింది. దీంతో సునీతా మహేందర్ రెడ్డిని ఎక్కడి నుంచి పోటీలోకి దింపుతుందని నేడే తేలే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సికింద్రాబాద్ టికెట్ ను బొంతు రామ్మోహన్‌కు, మల్కాజ్ గిరి సీటును చంద్రశేఖ్ రెడ్డికి ఇస్తారని ప్రచారం జరిగినా ఫ్లాష్ సర్వేతో పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ను సికింద్రాబాద్ నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టుగా తెలిసింది. మరోవైపు
పొత్తులో భాగంగా తమకు ఒక్క సీటైనా ఇవ్వాలని సిపిఐ అడుగుతోంది. దీనిపై ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి స్థాయిలో క్లారిటీ కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే పార్టీలో చేరిన కొత్తవారికి టికెట్‌లు ఇవ్వొద్దని పార్టీ కేడర్ అధినాయకత్వానికి సూచిస్తుండగా వారి సూచనలను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News