Tuesday, April 30, 2024

ప్రధానితో ఎపి సిఎం భేటి

- Advertisement -
- Advertisement -

AP CM meet with PM Modi

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానితో గంటకు పైగా ఎపి సిఎం భేటీలో ఎపి రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలను ప్రధాన మంత్రికి సిఎం నివేదించారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని, 2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55, 548.87 కోట్లుగా నిర్ధారించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని సిఎం విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరాన్ని మీ ముందుకు తెస్తున్నానని, ఇందులో నిర్మాణ పనులకోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ, పునరావాసంకోసం రూ.22,598 కోట్లు ఖర్చవుతుందని వివరించారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపుకోసం అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. దీనివల్ల ఎపికి అన్యాయం జరుగుతోందని, ముఖ్యంగా రాష్ట్రంలో 1.45 కోట్ల కుటుంబాలకు రేషన్ అందిస్తుంటే, ఇందులో కేంద్రం నుంచి కేవలం 0.89 కోట్ల కుటుంబాలకు మాత్రమే అందుతోందని తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎపిమినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బీచ్‌శాండ్ మినరల్స్ ప్రాంతాలను కేటాయించాలని ఈమేరకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాం. తీవ్ర రుణభారాన్ని ఎదుర్కొంటున్న ఎపి విద్యుత్ పంపిణీ సంస్థలు తమ ఆర్థిక నిర్వహణకోసం ఈ డబ్బు చాలా అవసరమని ప్రధానికి విన్నవించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News