Tuesday, May 14, 2024

ఉదయపూర్ డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా జనగామ డిసిసి అధ్యక్ష నియామకం

- Advertisement -
- Advertisement -

33 జిల్లాల్లోని డిసిసి అధ్యక్షులను 22 అగ్రవర్ణ కులాలకే ఇచ్చారు
ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు
ఫిర్యాదు చేసిన డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. లింగాజీ

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉదయపూర్ డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా జనగామ డిసిసి అధ్యక్ష నియామకం జరిగిందని, జనగామ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. లింగాజీ వాపోయారు. ఈ విషయమై ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ను కలిసి ఫిర్యాదు చేయడం కోసం ఢిల్లీ వచ్చానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి అనేక పార్టీలు మారి ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారని, ఆయన జనగామ జిల్లా వాసి కాదని, పక్కనే ఉన్న సిద్దిపేట జిల్లాకు చెందినవాడని, కాంగ్రెస్ మార్గదర్శకాల్లో డిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యేవారు అదే జిల్లాకు చెందిన వారై ఉండాలన్న నిబంధన ఉందన్నారు.

జనగామ, భువనగిరి, నిర్మల్ జిల్లాల అధ్యక్షులుగా నియమితులైన వారు సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందించారంటూ సిఫార్సు లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారని, ఇది ముమ్మాటికీ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించడమేనని ఆయన తెలిపారు. అలాగే భువనగిరి, జనగామ జిల్లాల డిసిసి అధ్యక్ష పదవులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సు చేసినట్లు రేవంత్ ఆ లేఖలో పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సులను కేవలం ఈ రెండు జిల్లాలకే ఎందుకు తీసుకున్నారు? రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? అయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భారత్ జోడో యాత్రలో పాల్గొనలేదు. పైగా స్టార్ క్యాంపెన్‌గా ఉండి కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్గొనలేదు. అలాంటి వ్యక్తి జనగామ జిల్లాకు చేసిన సిఫార్సును ఎలా పరిగణనలోకి తీసుకున్నారు? స్థానికేతరులను డిసిసి అధ్యక్షులుగా నియమించడం స్థానిక కార్యకర్తలను తీవ్రంగా కలిసి వేస్తోందన్నారు. ఈ జిల్లాల అధ్యక్ష నియామకాల్లో బిసిలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, 33 జిల్లాల్లో 22 అగ్రవర్ణ కులాలకే ఇచ్చారని, కేవలం 7 మాత్రమే బిసిలకు ఇచ్చారని ఆయన ఆరోపించారు. జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ ఉన్న బిసిలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నేతలు పార్టీ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించారన్నారు. కొమ్మూరి ఏ జిల్లా వ్యక్తో అధిష్టానానికి తెలియదని, కాంగ్రెస్ రాజ్యాంగం, బైలాస్ ప్రకారం స్థానిక వ్యక్తికే డిసిసి పదవి ఇవ్వాలని లింగాజీ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News