Wednesday, May 1, 2024

సార్వత్రికానికి సన్నాహలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా, రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సక్రమంగా చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్‌కుమార్ వ్యాస్ సూచించారు. బుధవారం ఎన్నికల ఏర్పాట్లపై అధికార యంత్రాంగంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభకుఇటీవల జరిగిన ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో రాష్ట్ర బృందం చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎన్నికల నిర్వహణలో ఎదురైన సమస్యలను గుర్తించి, వాటిని అధిగమించడానికి వ్యూహాలు రూపొందించాలని అధికారులకు సూచించారు.శిక్షణా సమావేశాలతో సహా ఇప్పటివరకు చేసిన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆయనకు వివరించారు. పలు అంశాలపై చర్చిం చి కొన్ని అంశాలపై స్పష్టత కోరారు. పోటీ చేసే అభ్యర్ధుల నామినేషన్లు, ఎన్నికల విధుల్లో ఉన్నవారి ఓటింగ్ వంటి విషయాలలో అనుసరించాల్సిన తాజా ఏకీకృత సూచనలను కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో జారీ చేయబోతోందని వ్యాస్ తెలిపారు.

రాష్ట్రంలో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అదనపు బలగాల ఆవశ్యకతపై, బడ్జెట్ అవసరాలపై అంచనాలు రూపొందించాలని అధికారులను కోరారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి సూ చించారు.ఎన్నికల నిర్వహణ మరింత పకడ్బందీగా ఉండాలంటే ఐటీ అప్లికేషన్స్, ఇతర సాంకేతిక సంబంధిత వ్యవస్థలను బలోపేతం చేయాలని రాష్ట్ర సీఈఓ వికాస్‌రాజ్‌కు సూచించారు. అదే విధంగా ఎన్‌కోర్యాప్‌నుసమర్ధంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల వెలుపల కెమెరాలను ఏర్పాటు చేయడం మంచి ఫలితాలనిచ్చిందని ప్రశంసించారు. గత శాసన సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నగదు, వస్తువులు పట్టుబడిన విషయం చర్చకు రావడంతో ప్రతి జప్తుకు సంబంధిత అధికారుల పేర్లతో సహా అన్ని వివరాలతో కూడిన రశీదులు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తనిఖీల సందర్భంగా జరిగేజప్తులు,

తిరిగి ఆధారాలు చూపించి వారి వస్తువులు వారు తిరిగి పొందే వెసులుబాటుపై ఈసారి ముందస్తుగా ప్రచారం కల్పించాలని, వారి వస్తువులు వారు తిరిగి పొందే విధానాన్ని సరళతరం చేయాలని పేర్కొన్నారు. వ్యాపారులు వ్యాపార లావాదేవీల కోసం నిత్యం తీసుకెళ్తున్న బంగారం, వెండి తదితర ఆభరణాల విషయంలో, తమిళనాడులో అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి, సానుకూలంగా ఉంటే అనుసరించాలని సలహా ఇచ్చారు. ఈ వస్తువులు, నగదు నియంత్రణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సిఇఓ తరచుగా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల పంపిణీలో జాప్యాన్ని నివారించడానికి జిల్లా స్థాయిలో వాటిని ముద్రించడం, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమస్యపైనా సూచనలు చేస్తూ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్‌లకు ఒక సిద్దం చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చన్నారు. ఈ సమావేశంలో అదనపు సిఇఓ లోకేష్ కుమార్, డిప్యూటీ సిఇఓ సత్యవాణి, జాయింట్ సిఇఓ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి సంజయ్ జైన్, ఎడిజి, ఎన్నికల వ్యయ నోడల్ అధికారి మహేష్ భగవత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News