మనతెలంగాణ, హైదరాబాద్ : యువతులు, మహిళలతో సన్నిహితంగా ఉంటూ వారి ఫొటోలు సేకరించి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మేయిల్ చేస్తున్న నిందితుడిని మీర్పేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బి నగర్ డిసిపి సన్ప్రీత్సింగ్ తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రంగారెడ్డిజిల్లా, మంచాల మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మహ్మద్ ఆస్లాం ఇంజనీరింగ్ను మధ్యలోనే ఆపివేశాడు. తాను చదివిన ఇంజనీరింగ్ కాలేజీలో డ్యాన్స్ మాస్టర్గా పనిచేస్తున్నాడు.
మీర్పేటకు చెందిన బాధితురాలు అదే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. ఇద్దరు ఒకే కాలేజీలో పనిచేస్తుండడంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. దీంతో ఆమెకు తెలియకుండా బాధితురాలి నగ్న ఫొటోలు తీసుకున్నాడు. కొంత కాలం తర్వాత తనకు రూ.3లక్షలు ఇవ్వాలని లేకుంటే ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్మేయిల్ చేయడం ప్రారంభించాడు. బాధితురాలు రూ.10,000 ఇచ్చింది, అయినా వేధింపులు ఆపకపోవడంతో భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు మహిళనే కాకుండా కాలేజీలో చదువుతున్న పలువురు విద్యార్థినుల ఫొటోలు తీసుకుని ఈ విధంగా బ్లాక్మేయిల్ చేయడంతో బాధితులు ఉప్పల్, కందుకూరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.