మనతెలంగాణ, హైదరాబాద్ : వివాహితను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఒప్పో మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డిజిల్లా, ఇబ్రహింపట్నం మండలం, పోచారం గ్రామానికి చెందిన కోరమోని భరత్ చదువుకుంటున్నాడు. నిందితుడు బాధితురాలి ఇంటి పక్కన నివసిస్తున్నాడు. వివాహితతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఆలోచనతో ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లాడు. తనతో లైంగికంగా సంబంధం పెట్టుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి చేశాడు. దానికి బాధితురాలు నిరాకరించడంతో చాలా మందిలో వివాహేతర సంబంధాలు ఉన్నాయని నీ భర్తకు చెబుతానని బెదిరించాడు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలు ఇంట్లో నుంచి బయటికి గెంటి వేసింది. బాధితురాలిపై కక్ష పెంచుకున్న నిందితుడు రూ.3,400 చెల్లించి ప్రైవేట్ నంబర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని బాధితురాలికి, ఆమె భర్తకు తరచూ ఫోన్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ వెంకటేష్ తదితరులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.