Monday, April 29, 2024

ఆర్టికల్ 35ఎ భారతీయుల ప్రాథమిక హక్కులను లాగేసుకుంది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని 35ఎ అధికరణ జమ్మూ, కశ్మీర్‌లో నివసించని పౌరుల ప్రాథమిక హక్కులను లాగేసుకుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఆర్టికల్ 35ఎ జమ్మూ, కశ్మీర్‌లో నివసించని ప్రజలకు కొన్ని కీలక రాజ్యాంగ హక్కులను లేకుండా చేసిందని ఆయన అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై మంగళవారం 11వ రోజు విచారణ సందర్భంగా సిజెఐ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఆర్టికల్ 370తో పాటుగా 35ఎను కేంద్రప్రభుత్వం 2019 ఆగస్టులో రద్దు చేసింది. ఈ రెండు అధికరణలు జమ్మూ, కశ్మీర్ ప్రజలకు విశేష అధికారాలుకల్పించాయి. వారిని శాశ్వత నివాసులుగా నిర్వచించాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, ఆస్తుల కొనుగోలు, సమాన అవకాశాల హక్కులను ఈ ఆర్టికల్ పౌరులకు లేకుండా చేసిందని అన్నారు.ఈ ఆర్టికల్ జమ్మూ, కశ్మీర్ పౌరులకు ప్రత్యేక కల్పించడం వల్ల రాష్ర్టేతరులు ఆ హక్కులు కోల్పోయారని చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించే 16(1),దేశంలో ఎక్కడైనా నివసించే, స్థిరపడే హక్కును కల్పించే ఆర్టికల్ 19(1)(ఇ),ఆసి ్తకొనుగోలు, వృత్తి వ్యాపారాలు చేయగల స్వేచ్ఛనిచ్చే9(1)(ఎఫ్)లాంటి మూడు ప్రాథమిక హక్కులను ఆర్టికల్ 35 ఎ హరించి వేసిందని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. కాగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, జమ్మూ, కశ్మీర్‌లోని శాశ్వత నివాసులు, ఇతర నివాసుల మధ్యే కాకుండా దేశంలోని ఇతర పౌరుల మధ్య కూడా ఆర్టికల్ 35ఎ వ్యత్యాసాన్ని సృష్టించిందని అన్నారు. జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక హక్కును రద్దు చేయడం ద్వారా కేంద్రం దేశం మొత్తాన్ని ఏకరీతిన ఉంచిందన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయకముందు భారత రాజ్యాంగంలో చేసిన ఏ సవరణ కూడా జమ్మూ, కశ్మీర్‌కు వర్తించేది కాదన్నారు. కాగా జమ్మూ, కశ్మీర్‌లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఎప్పటిలోగా జరుగుతుందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి తుషార్ మెహతా సమాధానమిస్తూ ఆ రాష్ట్ర పరిస్థితిపై గురువారం పాజిటివ్ ప్రకటన చేయనున్నట్లు కేంద్రం తెలిపిందన్నారు. కేంద్రపాలిత ప్రాంతం అనేది శాశ్వతం కాదని, కానీ లడాఖ్ మాత్రం యుటిగానే ఉంటుందని తుషార్ మెహతా తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News