తీవ్ర గాయలు, ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్: అపార్ట్మెంట్లో ఉంటున్న ఇద్దరు వృద్ధులపై దాడి చేసిన సంఘటన నగరంలోనిన దోమలగూడలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం… హైకోర్టు రిటైర్డ్ ఉద్యోగి సీతాభాగ్యలక్ష్మి(61), జ్యోత్సరాణి(66) ఇద్దరు అక్కాచెల్లెలు. ఇద్దరు ఒంటరిగా అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఎపిలోని ప్రకాశం జిల్లా, తాలూరు మండలానికి చెందిన కోట నరేందర్ స్నేహితుల వద్ద అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చమని స్నేహితులు ఒత్తిడి చేస్తున్నారు, దానికి తోడు చేసేందుకు పనిదొరకక పోవడంతో తినడానికి కూడా కష్టంగా మారింది.
ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీన ఏమి చేయాలో దిక్కుతోచని నిందితుడు దోమలగూడలోని సౌభాగ్య అపార్ట్మెంట్లోని ఇంటికి వెళ్లి మహిళ మెడపై కత్తి పెట్టి డబ్బులు డిమాండ్ చేశాడు. చెల్లి అరువడంతో ఇంట్లోనే ఉన్న అక్క కత్తితో నిందితుడిని బెదిరించింది. దీంతో యువకుడు ఇద్దరు మహిళలపై కత్తితో దాడి చేశాడు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో హైదర్గూడలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. సుమారు 30 కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.