అమెరికా : న్యూమెక్సికో లోని ‘ శాంటే ఫే సిటీ’ ప్రాంతంలో ఓ భారతీయ రెస్టారెంటుపై దుండగులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా అమెరికాలో జాత్యహంకార దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ‘ఇండియా ప్యాలస్’ అనే రెస్టారెంట్ ను వారు నాశనం చేసినందువల్ల దీని యజమాని బల్జీత్ సింగ్ కి లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని యజమాని చెప్పారు. ఈ రెస్టారెంటులోని టేబుళ్లు, కుర్చీలను దుండగులు ధ్వంసం చేశారని, దేవతా విగ్రహం తలను పగులగొట్టారని, కంప్యూటర్లు దోపిడీ చేశారని ఆయన తెలిపారు.
గోడలపై ద్వేష పూరిత రాతలు రాశారు. ‘వైట్ పవర్’, ట్రంప్ 2020, గో హోమ్ అనే నినాదాలే కాక.. అసభ్యపు రాతలు రాశారని, తనను చంపుతామని బెదిరిస్తూ హెచ్చరికలు చేశారని బల్జీత్ సింగ్ పేర్కొన్నారు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో జాత్యహంకార ధోరణులు పెరిగిపోయాయన్నారు. పౌర హక్కుల సంస్థ సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ ఈ సంఘటనను ఖండించింది.