సిద్దిపేట : ప్లాస్టిక్ రహితంగా సిద్దిపేటను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం, తడి, పొడి చెత్త నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీశ్రావు మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కేన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రావడమే కాక పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని మంత్రి చెప్పారు. తడి, పొడి చెత్తలను వేరుచేసి మునిసిపల్ వాహనాలకు అందించాలని ఆయన ప్రజలకు సూచించారు. తడి చెత్తతో ఎరువులను తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఎరువులను పంటలకు ఉపయోగిస్తే వాటి ద్వారా వచ్చే పదార్థాలతో సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని మంత్రి చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే వ్యాధులు రావాని ఆయన స్పష్టం చేశారు.
సిద్దిపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఈ పనులు పూర్తికాగానే పారిశుధ్ధ్య సమస్య అనేదే ఉండదని హరీశ్రావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు ఒక మొక్కను నాటాలని, అలాగే మరణించిన వారి జ్ఞాపకార్ధం ఓ మొక్కను నాటాలని ఆయన చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించి భావి తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముజమిల్ఖాన్, మునిసిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, ఎఎంసి ఛైర్మన్ పాలసాయిరాం, కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్, మచ్చ వేణుగోపాల్రెడ్డి, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు హమీద్, శ్రీనివాస్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.