మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరద బాధితులను ఆదుకునేందుకు హీరో నందమూరి బాలకృష్ణ ఆదివారం నాడు కోటిన్నర రూపాయాలను విరాళం ఇచ్చి గొప్ప మనస్సు చాటుకున్నారు. నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లోని కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడంతో పాటు పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా కొంతమంది నిరాశ్రయులు అయ్యారు. అయితే హైదరాబాద్ వరద బాధితులకు నందమూరి బాలకృష్ణ ఒక కోటి 50 లక్షలు విరాళం ప్రకటించారు. ఇటీవల రోడ్డు పక్కనున్న నివాసాలు పూర్తిగా వర్షపు నీరుతో కొట్టుకుపోయిన వారికి అండగా నిలిచారు నందమూరి బాలకృష్ణ. అదేవిధంగా పాతబస్తీలో బసవతారక రామా సేవసమితి ఆధ్వర్యంలో 1000 కుటుంబలాకు బిర్యానీ ఏర్పాటు చేసి ఆదివారం సాయంత్రం వారికి అందించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అలాగే సినీ కార్మికుల కోసం నందమూరి బాలకృష్ణ విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే.