Monday, May 6, 2024

ఎంఐఎంకు డిపాజిట్లు దక్కకుండా చేస్తాం: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఐఎం పార్టీకి దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయాలని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణలో హిందుత్వ వాతావరణం కనిపిస్తోందని, బిజెపి దమ్ము చూపిస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింహాంలా ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం శివాజీ మహరాజ్ సేవాదళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కార్వాన్ నియోజకవర్గంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లడారు.. తెలంగాణలో ఎంఐఎం పార్టీని తరిమికొడతామన్నారు.

15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను నరికి చంపుదామని మాట్లాడిన వ్యక్తులను ఊరుకుందామా? వీపంతా సాప్ చేయాలన్నారు. హైదరాబాద్‌లోని ప్రజలంతా ఎంఐఎం సవాల్‌ను స్వీకరించి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ఎనిమిది నెలల పాటు కష్టపడితే తెలంగాణలో రామరాజ్యం ఏర్పాటు చేసే బాధ్యత బిజెపి తీసుకుంటుందని ఆయన చెప్పారు. 12 శాతం ఓట్లు ఉన్న ఎంఐఎం పార్టీ తెలంగాణలో ఏడు సీట్లు గెలిస్తే.. మరి 80శాతం ఓటర్లు ఉన్న వాళ్ళు ఎన్ని సీట్లు గెలవాలని అని ప్రశ్నించారు. ముస్లింలను, క్రైస్తవులను కించపరిస్తూ తాను ఏనాడూ మాట్లాడలేదని బండి సంజయ్ తెలిపారు.

ఎంఐఎం పార్టీ పాతబస్తీ తప్పితే ఎక్కడైనా పోటీ చేస్తుందా? ఎందుకు పోటీ చేయడం లేదని ఆయన నిలదీశారు. హైదరాబాద్‌లోని హిందూ సమాజమంతా సంఘటిత శక్తి ఏర్పడి ఎంఐఎం పార్టీని ఓడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో హిందూ వాతావరణం కనిపిస్తుంది కాబట్టే కుహానా శక్తులు భయపడి కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆ కుట్రలను భగ్నం చేసి గోల్కొండ కోటపై కాషాయం జెండాను రెపరెపలాడిద్దామని ఆయన పిలుపునిచ్చారు. శివాజీ మహారాజ్ ను స్ఫూర్తిగా తీసుకుని ఓటు అనే ఆయుధంతో తెలంగాణలో హిందువుల దమ్మేందో చూపిద్దామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News