థాణె: మహారాష్ట్రలోని భివాండి పట్టణంలో సోమవారం తెల్లవారుజామున ఒక మూడంతస్తుల భవనం కూలిపోగా ఏడుగురు పిల్లలతోసహా 11 మంది మరణించారు. ఒక నాలుగేళ్ల బాలుడితోసహా 13 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 43 ఏళ్ల క్రితం నాటి జిలానీ అనే ఈ మూడంతస్తుల భవనం సోమవారం తెల్లవారు 3.40 గంటల ప్రాంతంలో కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులలో ఒక రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు వారు చెప్పారు. థాణెకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే భివాండి పట్టణం మరమగ్గాలకు ప్రసిద్ధి. కూలిపోయిన భవనంలో 40 ఫ్లాట్లు ఉండగా దాదాపు 150 మంది నివసిస్తున్నారు. వారంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
భవన శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం పోలీసు జాగిలాల సాయం తీసుకున్నట్లు ఎన్డిఆర్ఎఫ్ డిజి ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. భవనంలోని ఒక భాగం కూలిపోయిందని, శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారని థాణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. ఈ భవనం భవాండి-నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్లోని శిథిల భవనాల జాబితాలో లేదని ఆయన చెప్పారు. భవన యజమాని సయ్యద్ అహ్మద్ జిలానీపై కేసు నమోదు చేసినట్లు భివాండి డిసిపి రాజ్కుమార్ షిండే చెప్పారు. భవనం కూలిపోయిన ఘటనపై దర్యాప్తు జరుపుతామని థాణె ఇన్చార్జి మంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. భవనాన్ని సందర్శించిన ఆయన మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. భివాండి పట్టణంలో ప్రమాదకరస్థితిలో ఉన్న 102 భవనాలలో నివసిస్తున్న వారిని ఇప్పటికే ఖాళీ చేయించామని ఆయన చెప్పారు.
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
భివాండి పట్టణంలో మూడంతస్తుల భవనం కూలిపోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన సంతాపాన్ని తెలియచేశారు. సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఇదిలా ఉండగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే భివాండి దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందచేయాలని, సహాయక కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించారు.