Thursday, May 9, 2024

బిహార్‌లో ఒబిసి, ఈబిసిలే 63 శాతం.. కులగణన సర్వేలో వెల్లడి

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్‌లో కులగణన సర్వే నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు(ఒబిసి), అత్యంత వెనుకబడిన తరగతులు (ఇబిసి) కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్టును రాష్ట్ర డెవలప్‌మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ సోమవారం విడుదల చేశారు. తాజా నివేదిక ప్రకారం బీహార్ రాష్ట్ర జనాభా దాదాపు 13.07 కోట్లు. వీరిలో అత్యంత వెనుకబడిన తరగతుల (ఇబిసి) వారు 36 శాతంగా ఉన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి) వారి వాటా 27.13 శాతంగా తేలింది. కులాల వారీగా చూస్తే ఒబిసి వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది. మొత్తం రాష్ట్ర జనాభాలో వీరి వాటా 14.27 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సి) జనాభా 19.7 శాతం. షెడ్యూల్డ్ తెగల (ఎస్‌టి) జనాభా 1.7 శాతంగా నమోదైంది. జనరల్ కేటగిరీకి చెందిన వారి జనాభా 15.5 శాతంగా ఉన్నట్టు తేలింది.

దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత ఏడాది జూన్‌లో ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాష్ట్రం లోని 38 జిల్లాల్లో , రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే కులగణను వ్యతిరేకిస్తూ పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ సర్వేకు అనుమతించింది. దీంతో ఈ విషయం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది. కులగణన నివేదిక నేపథ్యంలో అధికార కూటమి లోని భాగస్వామ్య పక్షాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు సీఎం నితీశ్ కుమార్ సోమవారం ఉదయం మీడియాతో అన్నారు. ఈ భేటీలో కులగణన నివేదికపై చర్చిస్తామన్నారు. ఓబీసీ కోటా పెంపు సహా ఇతరత్రా అంశాలపై సమాలోచనలు జరుపుతామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News