Wednesday, May 1, 2024

కమలం కదనోత్సాహం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కమలనాథులు పార్లమెంటు ఎన్నికల పోరుకు నడుం బిగిస్తున్నారు. ఎన్నికలకు సమ యం సమీపిస్తుంటంతో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి పెద్దఎత్తున ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈసారి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో విజయ సంకల్ప యాత్ర చేపట్టి ప్రధాని మోడీ 10 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించన్నారు. ఈనెల 20 నుంచి బస్సు యాత్రలకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతో ంది. అందుకోసం మార్చి 4వ తేదీన రాజధాని నగరంలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ నిర్వహించే రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, యుపి సిఎం యోగి అథిత్యనాథ్ ప్రచారం చేసేందుకు తెలంగాణ బాట పడుతున్నట్లు తెలిసింది. నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో పాటు ఓటింగ్ శాతం పెరగడంతో అదే ఊపులో మరోసారి ప్రజల వద్దకు వెళ్లేందుకు ఆపార్టీ సీనియర్లు వ్యుహాలు రచిస్తున్నారు.

2019 పార్లమెంటు ఎన్నికల్లో ఊహించని విధంగా నాలుగు ఎంపి సీట్లు గెలుచుకుని బిఆర్‌ఎస్ తరువాత బిజెపి రెండోస్ధానంలో నిలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక గోషామహల్ గెలిచిన పార్లమెంటు సీట్ల విషయంలో ప్రజలు ఆదరించారని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలవడంతో లోక్‌సభ ఎన్నికల విషయంలో ప్రజలకు తమకు సానుకూలంగా ఉంటారనే భావతో పార్లమెంటు స్దానాలు గతం కంటే ఎక్కువ గెలవచ్చనే ధీమాలో కమలనాథులు 8 నుంచి 10 సీట్లలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలకు దీటుగా ఎన్నికలో బరిలో పోరాడేందుకు అస్త్రాలు సిద్దం చేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కేంద్రంలో మోడీ, అమిత్‌షా నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం కొలువుదీరేందుకు శ్రేణులంతా మూడు నెలల పాటు శ్రమించాలని సూచిస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్షకుపైగా ఓట్లు సాధించిన నేతలకు పార్లమెంటు అభ్యర్ధిగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది.

మల్కాజిగిరి నుంచి పోటీకి చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బిజెపి మధ్యప్రదేశ్ ఇంచార్జీ మురళీధర్‌రావు కాలు దువ్వుతున్నారు. మహబూబ్‌నగర్ నుంచి బిసి సామాజిక వర్గానికి చెందిన తల్లోజు ఆచారి, మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డికె అరుణ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మెదక్ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రఘనందన్‌రావు ప్రకటించగా, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా పార్టీ ఆదేశిస్తే సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. భువనగిరి నుంచి మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, గూడురు నారాయణరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

చేవెళ్ల నుంచి మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, యోగానంద్ తామే పోటీ చేస్తామని అనుచరులతో చెబుతూ నియోజకవర్గాల్లో రోజుకో చోట సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నుంచి భగవంత్‌రావు, రాజాసింగ్ బరిలో నిలుస్తున్నట్లు నియోజకవర్గంలోని కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్య వహిస్తున్న సోయం బాపురావు మరోసారి రేసులో ఉంటారని, నిజామాబాద్ ఎంపి స్దానం నుంచి ధర్మపురి అర్వింద్‌కుమార్, కరీంనగర్ నుంచి బండి సంజయ్‌కుమార్ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు పార్టీ పెద్దలు వెల్లడిస్తున్నారు. గ్రేటర్‌లోని సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పోటీ చేసి మరోసారి కేంద్ర మంత్రివర్గంలో కొలువుదీరుతారని పార్టీ నాయకత్వం అంచనా వేస్తుంది. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్దానాల్లో ఏపార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా అన్ని స్ధానాల్లో పోటీ చేస్తామని, బలమైన నియోజకవర్గాల్లో ప్రజాబలమున్న నేతలను ఎంపిక చేసి విజయం సాధిస్తామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News