Tuesday, April 30, 2024

బిజెపి ప్రభుత్వం ఎన్నడూ వాగ్దానాలు నెరవేర్చలేదు!

- Advertisement -
- Advertisement -

మదికేరి(కర్నాటక): అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్నడూ తన వాగ్దానాలను నెరవేర్చలేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆదివారం అన్నారు. ఏడాదిలో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, ఇతర కల్లబొల్లి వాగ్దానాల ద్వారా బిజెపి గద్దెనెక్కిందని తెలిపారు. బిజెపి పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టో కూడా అలాంటిదేనని ఆయన ఎద్దేవ చేశారు. వారు చేసే వాగ్దానాలు నెరవేర్చరు సరికదా భవిష్య త్తులో కూడా అవేవి గుర్తెరుగనట్లు వ్యవహరిస్తారన్నారు. కావాలంటే 10 ఏళ్ల ప్రధాని మోడీ ప్రభుత్వ పనితీరును మీరు సమీక్షించుకోవచ్చని అన్నారు.

‘‘బిజెపి వారు గత వాగ్దానాలు నెరవేర్చారా? అది మనం చర్చించాలి. ప్రతి ఒక్కరి ఖాతాలోకి రూ. 15 లక్షలు జమా చేశారా? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పించారా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారా? వారు ‘మేక్ ఇన్ ఇండియా’ను విజయవంతం చేశారా? వారు చెప్పిన ‘అచ్ఛే దిన్’ వచ్చాయా? అన్ని వస్తువుల ధరలు దిగి వచ్చాయా?’ అంటూ ఆయన ప్రశ్నించారు. బిజెపి మేనిఫెస్టో గురించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశాలను నిలదీశారు. బిజెపి ఎన్నడూ వాగ్దానాలు పూర్తి చేయలేదు. భవిష్యత్తులో కూడా పూర్తిచేయబోదు అని తేల్చి చెప్పారు.

‘‘బిజెపి 2018 కర్నాటకలో ఎన్నికలప్పుడు అనేకానేక వాగ్దానాలు చేసింది. దాదాపు 600 వాగ్దానాలు చేసింది. కానీ వాటిలో ఆరు కూడా నెరవేర్చలేదు. వారసలు ముందు ఈ పదేళ్ల పాలనలో ఏమేమి చేశారో చెప్పమనండి. ముందు వాటిని సమీక్షించాకే వారి తీరేమిటో తేలుద్దాం’’ అని చెప్పుకొచ్చారు.

ప్రధాని మోడీ ఆదివారం బిజెపి లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో ను విడుదల చేశారు. అది ప్రధానంగా పేదలు, యువత, రైతులు, మహిళలకు ఉద్దేశించింది. బిజెపియేమో ఉపాధి కల్పించామని చెప్పుకుంటోంది. కానీ నిరుద్యోగం పెరిగిందా, తగ్గిందా? వాస్తవానికి బిజెపి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం పెరిగింది. వారు వాగ్దానం చేసినట్లు 21 కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు?’’ అని సిద్ధరామయ్య ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News