న్యూఢిల్లీ : బిజెపి నేతలు వారే దేవుళ్లైనట్టు రథాల్లో తిరుగుతున్నారని, ఈ రథాయాత్రను సమాజంలో చీలికలు తేడానికి వినియోగించుకుంటున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ధ్వజమెత్తారు. మైనార్టీ ముస్లింలు అత్యధిక శాతం ఉండే ఉత్తర్దినాజ్పూర్, మాల్డా జిల్లాల్లో టిఎంసి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ర్యాలీల్లో ఆమె ప్రసంగించారు. బిజెపికి సహాయకునిగా పనిచేస్తే హైదరాబాద్కు చెందిన ఎఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీకి అనుకూలంగా ఓటు వేసి తమ ఓటు విలువ పాడు చేసుకోవద్దని ఆమె ఓటర్లకు హితవు పలికారు. పొరుగునున్న బీహార్లో తమ ఉనికిని ప్రదర్శించుకున్న ఎఐఎంఐఎం బెంగాల్లో కూడా ముస్లిం ఓట్లను పొందడానికి ఎన్నికల సమరానికి సిద్ధమౌతోందని వ్యాఖ్యానించారు. బిజెపి నేతలు బూటకపు హిందువులని, పవిత్రమైన యాత్రను స్వార్థప్రయోజనాల కోసం అపఖ్యాతి పాలు చేస్తున్నారని విమర్శించారు.