రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన బాక్సర్ విజేందర్ సింగ్
న్యూఢిల్లీ: కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయకుంటే తనకు ప్రభుత్వం ఇచ్చిన రాజీవ్ ఖేల్రత్న పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని ప్రముఖ బాక్సర్, ఒలింపిక్ విజేత విజేందర్సింగ్ తెలిపారు. ఆదివారం నాడు ఆయన ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించిన అనంతరం తనకిచ్చిన పురస్కారాన్ని వాపసు చేస్తానని ప్రకటించారు. రైతుల ఆందోళనలో పాల్గొని వారికి సంఘీభావం తెలియజేశారు. ఇప్పటికే పంజాబ్, హర్యానాలకు చెందిన పలువురు క్రీడాకారులు రైతుల ఆందోళనకు మద్దతుగా తమ పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో హర్యానాకు చెందిన విజేందర్ సింగ్ చేరారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సైతం తనకు కేంద్రం ఇచ్చిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేసి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించడం తెలిసిందే.