Monday, April 29, 2024

బయటపడ్డ బీఆర్‌ఎస్, బీజేపీ నిజస్వరూపాలు

- Advertisement -
- Advertisement -

నల్గొండ : కేంద్రంలో, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు వేర్వేరు కాదని, రెండు ఒకటేనని రాష్ట్ర గవర్నర్ తమిళసైతో సీఎం కేసీఆర్ కలిసిపోయిన వైనం బట్టబయలు చేసిందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం నల్గొండ నియోజకవర్గంలో కొనసాగిన తన పాదయాత్ర సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకంలో నువ్వు కొట్టినట్టు, తిట్టినట్టు చెయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అని రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలన్న వారి కుట్రపూరిత అవలక్షణాలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జనం ముందుంచిందని నిన్నటితో అది నిజమని తేలిపోయిందన్నారు.

శాసనసభ బడ్జెట్ సమావేశాలు, జాతీయ జెండా ఆవిష్కరణ లాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ గవర్నర్‌తో కలిసి మాట్లాడటానికి, ఎదురుపడటానికి ఇష్టపడని కెసిఆర్ ఇప్పుడు సయోధ్య, బేరం కుదుర్చుకొని చిరునవ్వులు నవ్వుతూ గవర్నర్ తో కలిసిపోయిన ఘటనతో తెలంగాణ సమాజానికి కెసిఆర్ గురించి సంపూర్ణంగా అర్థమైందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడ గురించి తెలంగాణ సమాజానికి సంపూర్ణంగా అవగతమైందన్నారు. నిరంకుశ నియంత్రత్వ పోకడలతో ఫాసిస్టు పాలన సాగిస్తున్న ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లను వదిలించుకోకుంటే భావ స్వేచ్ఛ ఉండదని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. మోడీ, కేసీఆర్‌లు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేయడంలో భాగంగానే ఇద్దరు కలిసి ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులపై కుట్రపూరితంగా దేశ ద్రోహం (ఉపా) కేసులో ఇరికించారన్నారు.

దేశంలో మాట్లాడే స్వేచ్ఛ లేకుండా హరిస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలన్నారు. పది ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో అవినీతి అక్రమాలు, ధరణితో భూ కుంభకోణం, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ అక్రమాలు, హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూముల అమ్మకాల అవినీతి, కాలేశ్వరం అవినీతి, లిక్కర్ స్కాం అవినీతి చిట్టా తమ వద్ద ఉందని మాట్లాడిన అమిత్ షా, మోడీలు చట్టపరంగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మాటలకే పరిమితమయ్యారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ వేర్వేరు కాదు కాబట్టే ఇప్పటి వరకు కేసీఆర్‌పై ఎలాంటి చర్యలు లేవన్నారు.

ఆ రెండు పార్టీలు ఒకటే అని తెలంగాణ సమాజానికి అర్థం కావడంతో ఆ పార్టీలోకి వెళ్లిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవుతున్నారన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ను వదిలించుకోవడానికి రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకిక వాదాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న రాజకీయ పునరేకీకరణలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు కలిసి రావాలన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడి నవ తెలంగాణ నిర్మాణం చేసుకుందామని కోరారు.పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టి మూడు నెలలు దాటుతుందని, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన గుండెచప్పుడు, వారి ఆవేదనను మీడియా సాక్షిగా తెలంగాణ సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నానన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ప్రజల సంపదను దేశమందులను కాపాడే విధంగా ప్రతి ఒక్కరం కలిసి నడుద్దామని ప్రభుత్వాల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదామన్నారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని అన్నారు. సమావేశంలో నల్లగొండ జడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్దే సుమన్, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య, నల్లగొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, కత్తుల కోటి, చింతపల్లి గోపాల్, వెంకటయ్య, పెరిక వెంకటేశ్వర్లు, సూరెడ్డి సరస్వతి, జూలకంటి సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News