Wednesday, May 1, 2024

మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే

- Advertisement -
- Advertisement -
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించాలి
  • జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్

జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సంజయ్ సమక్షంలో పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం 9 ఏళ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి గడపగడపకు అందించారన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకం అందని గడప లేదన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించడంతో పాటు కుల వృత్తులు, చేతి వృత్తులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తూ బిఆర్‌ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

అధికారమే పరమావధిగా అది చేస్తాం… ఇది చేస్తామంటూ నమ్మబలుకుతున్నారని, గత 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ అప్పుడెందుకు చేయలేదన్నారు. పేదల గురించి వారు ఏనాడు ఆలోచన చేయలేదని, వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గత కర్ణాటక ఎన్నికల్లో ప్రజలకు లేని పోని ఆశలను చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హమీల్లో ఏ ఒక్కదానిని నెరవేర్చలేకపోయిందని, ఆ రాష్ట్ర ప్రజలు తాము కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని బహిరంగంగానే చెబతున్నారని అన్నారు. ప్రజల కష్ట సుఖాలను దగ్గరగా చూసిన కెసిఆర్ సిఎం కావడం వల్ల వినూత్న పథకాలకు ఆలోచన చేశారన్నారు.

మన రాష్ట్రంలో ఇస్తున్న రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా ఫించన్లు, కెసిఆర్ కిట్, దళిత బంధు, బీసీ బంధు, బీడి కార్మిక ఫించన్లు దేశంలో ఎక్కడా లేవన్నారు. విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతిస్తున్నారని, మన ఊరు మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి వైద్య విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు అన్ని రకాల వైద్య సేవలను ప్రజల ముంగిట్లోకి తీసుకువచ్చామన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి పల్లెల అభివృద్ధికి కోట్లాది నిధులు వెచ్చించామని, తద్వారా పల్టణాలకు ధీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.

ఏ సమస్య వచ్చినా నేనున్నానే భరోసా కల్పిస్తూ మీలో ఒక్కడిగా ఉంటున్న నన్ను ఆశీర్వదించాలని, రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని, ప్రతిపక్షాల మోసాల పట్ల అఫ్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాజేంద్రప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం, గ్రామ శాఖ అధ్యక్షుడు రాంశంకర్, మాజీ సర్పంచ్ నరేశ్, ఎఎంసి డైరెక్టర్ జైరామ్‌సురేశ్, ఫ్యాక్స్ డైరెక్టర్ పోచమల్లయ్య, నాయకులు సత్యనారాయణ, శ్యాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News